గణేష్‌ మండపానికి 316 కోట్ల ఇన్సూరెన్స్‌

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలంటే సందడి మామూలుగా ఉండదు. మండపాల దగ్గర్నుంచి విగ్రహాల వరకు ఆ కోలాహలమే వేరు. మండపాలు, విగ్రహాల కోసం వేలు, లక్షల్లోనే కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు నిర్వాహకులు. భారీ సెట్టింగ్స్‌తో మండపాలు నిర్మించి, అత్యంత ఖరీదైన గణనాథులను ప్రతిష్టిస్తున్నారు. గణేష్‌ ఉత్సవాలకు దేశంలోనే పేరుగాంచిన ముంబైలో ఓ గణేష్‌ మండపానికి ఏకంగా 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్‌ చేయించారు నిర్వాహకులు. ఇదిప్పుడు టాక్‌ ఆఫ్‌ ముంబైనే కాదు, టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. ముంబై కింగ్స్‌ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్‌ ఏర్పాటుచేసిన మండపం ముంబైలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. దాంతో, మండపానికి 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్‌ చేయించారు. కేవలం బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు 32కోట్ల ఇన్సూరెన్స్‌ చేశారు.మిగతా 263కోట్ల రూపాయలు మండపం కోసం. పూజారులు, వాలంటీర్లు, పార్కింగ్‌, సెక్యూరిటీ, ఇతర వర్కర్స్‌ ఈ బీమా కిందకి వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు, ప్రకృతి విపత్తుల కోసం మరో కోటి రూపాయల ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. మండపంలోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఈ బీమాలోకి వస్తాయి. మండపం ఆర్గనైజింగ్‌ టీమ్‌తోపాటు గణేష్‌ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.వినాయకచవితి మొదలైన రోజు నుంచి పదిరోజులపాటు ఈ ఇన్సూరెన్స్‌ ఉంటుందన్నారు జీఎస్‌బీ సేవా మండల్‌ నిర్వాహకులు. ఏటా ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నాం, అయితే, ఈసారి రికార్డుస్థాయిలో పెద్దమొత్తానికి బీమా చేయించామని చెబుతున్నారు. ప్రతి భక్తుడికీ భద్రత కల్పించడం తమ బాధ్యత, అందుకే, అందరికీ ఇన్సూరెన్స్‌ వర్తించేలా బీమా తీసుకున్నామంటున్నారు నిర్వాహకులు. కాగా, ఈ గణేష్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *