రాయలసీమ నుంచే పవన్‌ పోటీ

తిరుపతి, అక్టోబరు 12
తిరుపతి, చిత్తూరు టార్గెట్‌గా జనసేన పావులు కదుపుతోంది. బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన దృష్టి సారించింది. ఇక తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి స్థానాలపై నాగబాబు సమాలోచనలు సైకిల్‌ పార్టీకి కూడా టెన్షన్‌ పుట్టిస్తోంది. ఎందుకంటే గతంలో మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయ ప్రస్థానం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచే ప్రారంభమైంది.తిరుపతిలో ప్రజారాజ్యం ఆవిర్భావ సభ పెట్టడమే కాదు.. చిరంజీవి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి తిరుపతి. చిరంజీవికి తిరుపతివాసులు బ్రహ్మరథం పట్టారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో ఇప్పుడు చిరు తమ్ముడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి పోటీ చేయాలనే డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది.గత ఎన్నికల్లో భీమవరం, విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలోకి దిగితే విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై జనసేన కసరత్తు ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలం, పొత్తుతో పోటీ చేస్తే వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చిస్తోంది. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ కేడర్‌తో సవిూక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.స్థానికంగా టీడీపీ కేడర్‌తో కలిసి పని చేయాలని నాగబాబు జన సైనికులకు సూచించారు. టీడీపీ నేతలను గౌరవించాలని కోరారు. పార్టీలో విభేదాలు, ఏకపక్ష నిర్ణయాలకు తావు లేదని కేడర్‌కు నాగబాబు స్పష్టం చేశారు. జిల్లాలో జనసేన బలాన్ని నాగబాబుకు వివరిస్తూనే టీడీపీతో పొత్తుంటే ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపైనా పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకొచ్చింది జనసేన కేడర్‌.ఇక బలిజ కులస్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపైనే నాగబాబు ఫోకస్‌ చేశారు. ఆయన సవిూక్షల్లో కూడా వాటిపైనే చర్చ సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలపై జనసేన ఫోకస్‌ పెట్టింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.నగరిలో మంత్రి రోజాను టార్గెట్‌ చేయాలని జనసేన కేడర్‌ ప్రయత్నిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేసే రోజాపై పోటీ చేసి తీరాలంటూ నాగబాబుపై కేడర్‌ ఒత్తిడి తెచ్చింది. ఇక నాగబాబు పర్యటన సైకిల్‌ నేతల్లో కూడా గుబులు పుట్టిస్తోంది. పొత్తులో భాగంగా తమ సీట్లలో జనసేన కర్చీఫ్‌ వేస్తుందేమోనని టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *