మసీదులను కూల్చివేయాలన్న స్వీడిష్ నాయకుడి ప్రకటనపై వివాదం.. ప్రధానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి

ఒక హోదాలో ఉన్న నాయకులు అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్తుంటారు. సున్నితమైన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ముఖ్యంగా.. మతపరమైన అంశాల జోలికి వెళ్లి, లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తుంటారు. తాజాగా స్వీడెన్‌కి చెందిన జిమ్మీ అకెసన్ అనే నాయకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వీడిష్ వ్యతిరేక, యూదు వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేసే మసీదులను ఆక్రమించుకొని.. వాటిని కూల్చివేయాలని కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ఈ వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. చివరికి.. ఆ దేశ ప్రధాని దిగొచ్చి, దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్వీడన్ డెమొక్రాట్స్ (ఎస్‌డి) పార్టీ నాయకుడు జిమ్మీ అకెసన్ నవంబర్ 26వ తేదీన జరిగిన పార్టీ వార్షిక కాంగ్రెస్‌లో ఆ వ్యాఖ్యలు చేశాడు. ప్రజాస్వామ్య వ్యతిరేక, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే మసీదుల్ని స్వాధీనం చేసి.. వాటిని పడగొట్టడం మనం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తారాస్థాయిలో వివాదం నెలకొనడంతో.. స్వీడన్ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆ ప్రకటనలో జిమ్మీ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించారు. తన భావాలను వ్యక్తీకరించడం అవమానకరమైన మార్గాని తాను భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి ప్రకటనలు అంతర్జాతీయ ముప్పుకి దారి తీస్తాయని.. స్వీడన్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఎక్స్ వేదికగా కూడా స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అకెసన్ ప్రకటన తర్వాత ఇతర దేశాల నుండి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని.. ‘‘స్వీడన్‌లో మేము ప్రార్థనా స్థలాలను నాశనం చేయం. ఒక సమాజంగా మనం హింసాత్మక తీవ్రవాదంతో పోరాడాలి. దాని ప్రాతిపదిక ఏదైనప్పటికీ.. ప్రజాస్వామ్య, ఉదారవాద రాజ్యం చట్రంలో మనం అలా చేయాలి’’ అని పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జిమ్మీ అకెసన్‌ వ్యాఖ్యలను అధికారికంగా ఖండించాలని, మంత్రివర్గంలో పనిచేస్తున్న స్వీడన్ డెమొక్రాట్స్ సభ్యుల్ని తొలగించాలని ప్రధాని క్రిస్టర్సన్‌ను మాజీ ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *