పాతబస్తీలో మజ్లిస్ కార్యాలయానికి నిప్పు
పాతబస్తీ హాషమాబాద్లోని మజ్లిస్ పార్టీ కార్యాలయంపై పెట్రోల్(Petrol) పోసి నిప్పంటించిన ఇద్దరిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాషమాబాద్ న్యూ ఇందిరానగర్లో మజ్లిస్ పార్టీ నాయకుడు షరీఫ్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాడు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి పార్టీ కార్యాలయం తలుపులపై పోసి నిప్పంటించారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. తెల్లవారిన తర్వాత పార్టీ కార్యాలయం తలుపులు తగులబడి ఉండడం గమనించిన నాయకులు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల(CC cameras)ను పరిశీలించిన పోలీసులు స్థానికంగా ఉండే అమిర్, అబూబకర్ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న షరీఫ్ సోదరుడికి, నిందితులిద్దరికీ మధ్య గతంలో ఒకసారి గొడవ జరిగిందని, దాన్ని మనసులో పెట్టుకుని కార్యాలయానికి నిప్పు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.కేసు దర్యాప్తులో ఉంది.