మోడీ , నడ్డా వెళ్లారు… షా వస్తున్నారు

హైదరాబాద్‌, అక్టోబరు 7
తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. ఈ నెల మొదటి వారంలో మోడీ రెండు సార్లు తెలంగాణకు రాగా… నడ్డా శుక్రవారం హైదరాబాద్‌ లో పర్యటించారు. వరుస పర్యటనలతో బీజేపీ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు అగ్రనేతలు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న అమిత్‌ షా.. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో.. బీజేపీ అగ్ర నాయకత్వం స్పీడ్‌ పెంచుతోంది. వరుస బహిరంగ సభలతో హోరెత్తించేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా అధికార బీఆర్‌ఎస్‌కు ధీటుగా సభలు, సమావేశాలు నిర్వహించబోతోంది. ఆయా సభలకు బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. ఎన్నికల వేడిని రాజేసివెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశం జరగ్గా.. ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు.ఎన్నికల రూట్‌ మ్యాప్‌ ఖరారుపై నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, సునీల్‌ బన్సల్‌ దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో.. ఈ నెల 10న తెలంగాణకు రాబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఈ సందర్భంగా.. ఒకే రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.10న ఉదయం ఆదిలాబాద్‌ జిల్లాలో అమిత్‌షా సభ నిర్వహించనుండగా.. సాయంత్రం రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భారీ సభకు ప్లాన్‌ చేస్తున్నారు. బండ్లగూడ పరిధిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. మొత్తంగా.. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో.. బీజేపీ జాతీయ నాయకత్వం దండయాత్రకు సిద్ధం కావడంతోపాటు.. అగ్ర నేతల పర్యటనలతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *