ఆర్ధిక నియంత్రణకు కేంద్రం కసరత్తు

ఉద్యోగం సద్యోగం లేని యువకుడిని తండ్రి నిత్యం సంపాదన అవసరం గురించి చెబుతూ జ్ణాన బోధ చేస్తూనే ఉంటాడు. చీటికీ మాటికీ అక్కడా ఇక్కడా అప్పులు చేసి ఎక్కడ తల విూదకి తెస్తాడో అన్న భయమే తండ్రిని కొడుకుకు బాధ్యత గుర్తు చేసే విధంగా పురిగొల్లుతుంది. అందువల్ల కొడుకు అలవాట్ల?, ఖర్చులపై ఎప్పుడూ ఒక కన్నేసి వాటిని నియంత్రించడానికి, కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇందుకు బంధువు నుంచో, మిత్రుడి నుంచో సలహా తీసుకుని మరీ కార్యాచరణకు దిగుతాడు. కానీ దానివల్ల తండ్రీ కొడుకుల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయన్నది ఆయన ఆలోచనకు రాదు. ఇప్పుడు రాష్ట్రాల విూద ఆర్ధిక నియంత్రణకు కేంద్రం దాదాపు ఇదే ఆలోచన చేస్తోంది. తండ్రిగానో, పెద్దన్నగానో ఓవరాక్షన్‌ చేస్తోంది. దీని వల్ల ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలుగుతోందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అలా కాకుండా కాస్తంత భవిష్యత్తు దృష్టి, దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నాయన్న మాట వినపడుతోంది. వాటిలో తెలుగు రాష్ట్రాలు ముందు పీటిన ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి. వాటి వ్యవహారం, తీరు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం వల్ల దేశ ఆర్ధిక వ్యవ స్థకే నష్టంవాటిల్లుతోందన్న భయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో ఆర్దిక ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అందుకు శ్రీలంక పరిస్థితుల్నీ, ఆర్ధికవేత్తల హెచ్చరికల్ని చూపుతోంది. దీన్ని అధిగమించేందుకు ఆర్ధిక మండలి ఏర్పాటు అవసరాన్ని తెరవిూదకు తీసుకువస్తోంది. ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో కేంద్రం,రాష్ట్రాల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నం దు వల్ల నిపుణుల సలహా మేరకు ఆర్థిక మండలి ఏర్పాటును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందేనని 15వ ఆర్థిక సంఘం గతంలోనే ప్రభుత్వానికి సూచిం చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేస్తోంది. ఆర్ధిక మండలి ఏర్పాటు చేస్తే దాని ద్వారా రాష్ట్రాల నుంచీ కేంద్రం నుంచీ కూడా ఆర్దిక లావాదేవీల రికార్డులను తెప్పించి పరిశీలించే అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, బీహార్‌, రాజస్థాన్‌లలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు సవిూప కాలంలో రావచ్చునని ఇప్పటికే అనేకమంది ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం అన్నిదేశాలూ శ్రీలంకనే ఉదాహరణగా తీసుకుంటూ ఆ దుస్థితికి రాకుండా జాగ్రత్త పడాలన్నయోచనలో ఉన్నాయి. కానీ దేశంలో విపక్షా లన్నీ కేంద్రాన్ని, బీజేపీ పాలనలోని ఇతర రాష్ట్రాలలోని పరిస్థితులతో బేరీజు వేసుకుని కేంద్రం ప్రదర్శించే వివక్ష పూరిత వ్యవహారా లతో విసిగెత్తి ఉన్నాయి. కనుక ఆర్ధిక నిపుణుల సలహా మేరకు ఆర్ధిక మండలి ఏర్పాటును బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించే అవకాశాలే ఉన్నాయన్నది విశ్లేషకుల మాట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *