ఎన్నికల సిబ్బంది ఎంపికపై ఈసీ దృష్టి

కడప, నవంబర్‌ 25
తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాలుగునెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఏపీలోనూ ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ చేస్తోంది. దీనిపై వచ్చే వివాదాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సిబ్బంది ఎంపికపై ఈసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను ఈసీ కోరింది. జిల్లాల్లోని అన్నిశాఖల వివరాలు, కేటగిరీల వారీగా పంపాలని కోరారు. అన్నిశాఖల అధికారులతోపాటు ఎన్నికల సంఘం ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలు కేటగిరీలవారీగా సేకరించి పంపనున్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ అంశంలో ఉపాధ్యాయుల్ని దూరం పెట్టాలని అనుకుంటోంది. అందు కోసం 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ అప్పట్లో జీవో జారీచేసింది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే… అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టంచేసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉపాధ్యాయులే ఎక్కువగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈసీ ప్రత్యేకంగా ఈ విషయాన్నితన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధుల్లోకి తీసుకోవడంపై సంసిద్ధత జాబితాను సిద్ధం చేయాలంటూ ఎంఈవోలను కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు క్యాడర్‌వైజ్‌గా డిసెంబరు 25లోపు జిల్లా ఎన్నికల అధికారికి పంపాలని జిల్లా ప్రజాపరిషత్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్‌, ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు.మరో వైపు కారణాలు ఏవైనా టీచర్లకు ఎన్నికల విధులు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. అందుకే టీచర్లకు బదులుగా సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు వినియోగించుకోవాలని ఈసీకి సూచించే అవకాశం ఉంది. అయితే నిబంధనల ప్రకారం.. బోధనేతర పనులు అప్పగించకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం ఏపీకే పరిమితం. ఎన్నికల సంఘానికి వర్తించదు. ఎన్నికల విధుల నుంచి ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలంటే ఎన్నికల కమిషనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల నుంచి ఎంత మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు….ఎంతమంది ఎన్నికల విధులకు అవసరం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుంది. అంటే ఎన్నికల విధుల్లో ఎంత మంది సిబ్బంది అవసరం, ఏఏ క్యాడర్‌ ఉద్యోగులు అవసరం, ఏఏ క్యాడర్‌ ఉద్యోగులకు ఏఏ విధులు కేటాయించాలి వంటి అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం వద్ద అభ్యంతరం వ్యక్తం చేస్తుందని భావిస్తున్నారు. మరో వైపు ఎన్నికలను మ్యానిప్యులేట్‌ చేయడానికే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారడానికి వారే కారణం అంటున్నారు. సచివాలయ సిబ్బందిని బీఎల్‌వోలుగా నియమించారని .. వాలంటీర్ల సాయంతో వారు దొంగ ఓట్లు చేర్చడం… ఇతర ఓటర్లను తీసేయడం వంటివి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో పోలింగ్‌ సిబ్బంది నియామకం కూడా వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశంపై సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ సంస్థ తరపున మాజీ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *