ఇంట్లోనుంచి కొత్త సినిమా చూసేయండి.. కేవలం రూ. 99కే.. అద్భుతమైన అవకాశం..!
కొత్త సినిమా విడుదల అవుతుందంటే చాలు.. సినీ ప్రేక్షకులకు పండగే. ఫస్ట్ డే ఫస్ట్ షోనే.. తమ అభిమాన హీరో సినిమాను చూడాలని తహతహలాడుతుంటారు. ఆన్ లైన్లో… టికెట్స్ రాగానే బుకింగ్స్ చేసేసుకుంటారు. అయితే కరోనా పుణ్యమా అని.. చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటయ్యింది. దీంతో పాటు.. సినిమాలు కూడా ఇంట్లోనే… కూర్చొని చూడటం అలవాటు చేసుకున్నారు. ఓటీటీ ఊపందుకోవడంతో.. కొత్త సినిమా ఏదైనా సరే.. ఇంట్లోనే కూర్చొని చూసేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కొత్త సినిమా విడుదలైన రోజే ఇంట్లో కూర్చుని వీక్షించే సదుపాయాన్ని ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోంది. థియేటర్లలో సినిమా విడుదలైన రోజే రూ.99కే ఇంట్లో కూర్చుని సినిమా చూడొచ్చు.
ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ద్వారా కొత్త సినిమాలు ఆన్లైన్ విడుదల చేస్తామని ఫైబర్నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి చెప్పారు. ”సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి ఇద్దరికీ లాభం కలిగేలా కొత్త సినిమా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే.. ఫస్ట్డే.. ఫస్ట్షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జూన్ 2న విశాఖపట్నంలో లాంఛనంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏపీఎస్ఎఫ్ఎల్లో మొదటిసారి నిరీక్షణ సినిమా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రూ.99తో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త సినిమా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి 24 గంటల వరకు ఆ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇది ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్లో చూసేలా ఉంటుంది.
ఇప్పటికే గ్రామీణప్రాంతాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండడంతో పట్టణాలకు వచ్చి థియేటర్లలో సినిమా చూడలేనివారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని గౌతంరెడ్డి వివరించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 55వేల కి.మీ ఓఎఫ్సీని తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు గౌతంరెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 37వేల కి.మీ. వరకు వేశామన్నారు. 11,254 గ్రామ పంచాయతీల్లో 7600 పైగా గ్రామాలకు ఫైబర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలందరికీ తమ సేవలను చేరువ చేసేందుకు రెండు మూడు నెలల్లో కొత్త బాక్సులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే 5 కంపెనీలతో చర్చించామని, వచ్చే నాలుగేళ్లలో ఏపీఎస్ఎఫ్ఎల్ను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు తయారు చేశామని గౌతం రెడ్డి వివరించారు.