చెత్త పారేసే విషయంలో కుటుంబసభ్యుల మధ్య గొడవ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
చెత్త పారేసే విషయంలో నెలకొన్న వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరాబంకిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధ్నాయ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన బర్సాతీ, లాల్జీలు నివసిస్తున్నారు. అయితే వారికున్న కొంతభూమి విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం చెత్తపారేసే విషయంలో (ఆవు పేడ) రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో బర్సాతి, అతని భార్య రాజకుమారితోపాటు అనిల్, సునీల్, రామ్ సింగ్ గాయపడ్డారు. మరోవైపు నుంచి లాల్జీ, దుల్హన్, జడదీష్, గోకుల్, సరోజిని అనే ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రామ్ సింగ్, బరాసతి, గోకుల్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే 40 ఏళ్ల రామ్ సింగ్ మృతి చెందాడు. మరోవైపు బారసతి, గోకుల్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై అదనపు సూపరింటెండెంట్ పోలీస్ అఖిలేష్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ ‘‘ ఒకే కుటుంబానికి చెందిన వారు చెత్త పారేసే విషయంలో గొడవపడ్డారు. ఈ గొడవలో ఒక వ్యక్తి మరణించాడు. అనేక మంది గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాం’’ అని తెలిపారు.