ఇండియా ఆఫ్రికా కొత్త బంధాలు

బ్రిటిష్‌వారితో పాటు ఇతర సామ్రాజ్యవాద దేశాల నుంచి స్వాతంత్య్రం సాధించుకునే క్రమంలో ప్రపంచ దేశాలు భారత్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటాయి. ముఖ్యంగా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని నెల్సన్‌ మండేలా వంటి నాయకులు ఆఫ్రికా దేశాలకు వెలుగులు నింపారు. అందుచేతనే ఆఫ్రికా దేశాలకు భారత్‌ ఎల్లప్పుడూ ఒక మార్గదర్శకంగా నిలిచింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత భారత్‌`ఆఫ్రికన్‌ దేశాలు ఇరు వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం వాణిజ్య వర్తక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి.ముఖ్యంగా పెట్టుబడులు పెరగాలి. అభివృద్ధి సాధించాలి. అందులో భాగంగా ప్రస్తుతం ‘ది ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా`ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ’ పేరుతో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టుకునే విధంగా అక్కడ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవాలి. ఇరు వర్గాల మధ్య ఉన్న స్నేహ బంధం, ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు నడుం బిగించాలి. ఇప్పటికే ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ ప్రయత్నాలు ఫలించి 30 మిలియన్ల జనాభా పేదరికం నుంచి బయటపడిరది.2063 నాటికి ఆఫ్రికా దేశాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సింగిల్‌ విండో, సింగిల్‌ ఓపెన్‌ మార్కెట్‌ వంటి విధానాలతో ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ పని ప్రారంభించింది. భారత్‌తో అనేక ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా, ఇండియా అభివృద్ధి కోసం ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ఇరు దేశాలలో ప్రారంభించారు. రాయితీలతో కూడిన ఋణాలు, గ్రాంట్స్‌ ఇవ్వటం లాంటివి చేశారు. ‘కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రాం’ ద్వారా ఇరు ప్రాంతాల ఆర్థిక సామాజిక సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆఫ్రికా దేశాలలో భారత్‌ 70 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఓసీ కింద 12.26 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల సహాయం చేస్తున్నది. వీటి ద్వారా ఇప్పటికే 193 ప్రాజెక్టులు పూర్తి చేసారు. 66 ప్రాజెక్టులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 88 ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ పెట్టుబడులన్నీ పెట్రోల్‌, గ్యాస్‌, గనులు, బ్యాంకింగ్‌, ఫార్మా, వస్త్ర, ఆటోమొబైల్‌, వ్యవసాయ రంగంలో ఉన్నాయి.ఆఫ్రికా అందిస్తున్న ఈ పారిశ్రామిక విధానాలను మనం అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. గత వారం జరిగిన 17వ ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ`ఎగ్జిమ్‌ బ్యాక్‌ కాన్‌క్లేవ్‌ ఆన్‌ ద ఇండియా`ఇండో ఆఫ్రికా గ్రోత్‌ పార్టనర్‌ షిప్‌’ సమావేశంలో వివిధ ఆఫ్రికా దేశాల అధినేతలు, అధికారులు భారతదేశ పెట్టుబడుల విూద పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియా, ఆఫ్రికా బైలేటరల్‌ ట్రేడ్‌, పెట్టుబడుల విూద ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ నిర్ణయం తీసుకోనుంది. భారతీయ వాణిజ్యవేత్తలు, సంస్థలు, ఆఫ్రికాతో స్వేచ్ఛా వాణిజ్యం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారు. మనదేశంలో తయారైన వివిధ రకాల వస్తువులు, సరుకులను ఆఫ్రికా దేశాలలో అమ్ముకొనుటకు ఓపెన్‌ మార్కెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ధోరణి యూరప్‌, గల్ఫ్‌, ఆఫ్రికా ఖండంలో కూడా ఉండేలా కృషి చేస్తున్నారు.మన దేశం ముఖ్యంగా ఆఫ్రికాతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐటీ సర్వీసులు, హెల్త్‌, విద్య తదితర రంగాలలో అభివృద్ధి సాధించేలా ముందుకు సాగుతున్నది. మొబైల్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ ఇన్సూరెన్స్‌, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సహకారం పెంపొందించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మా, ఆరోగ్య రక్షణకు వ్యాక్సిన్‌ (టీకా), టెలీ మెడిసిన్‌, మందుల తయారీ రంగాలలో పెట్టుబడులను మరింత బలోపేతం చేయాలి. డిజిటల్‌ సెక్టార్‌పై దృష్టి సారించాలి. 2063 నాటికి డిజిటల్‌ రూపంలోకి మారే దిశగా అన్ని ఆఫ్రికా దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆహార రంగంలోనూ అభివృద్ధి సాధించాలి. ఆహార పదార్థాలను నిలువ చేయడానికి ‘కోల్డ్‌ స్టోరేజ్‌ హెడ్స్‌’ నిర్మించాలి. యువతకు, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి.2017 నుంచి 50 వేల మంది ఆఫ్రికన్‌ విద్యార్థులకు మన దేశం ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌’ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు ఇస్తోంది. ‘ఇండియన్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ ప్రోగ్రాం’ ఆధ్వర్యంలో ఆఫ్రికా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. సైంటిఫిక్‌ టెక్నాలజీ కోపరేషన్‌ కూడా అందిస్తున్నారు. నేటికీ ఆఫ్రికా దేశాలలో 90 శాతం మహిళలు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరందరూ ఎక్కువగా విద్య, ఆరోగ్య రంగంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ ప్రకటిస్తున్న ఆర్థిక విధానాలను మన దేశం అందిపుచ్చుకోవాలి. ఇరు ప్రాంతాల నేతలు కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలి. ధనిక దేశాల ఒత్తిడి, దోపిడి నుంచి బయట పడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ఇండో`ఆఫ్రికా దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక్కటి కావాలి. లేకపోతే భవిష్యత్తులో బడా దేశాల చేతిలో నలిగిపోక తప్పదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *