37 మందిపై టీఎస్ పీఎస్సీ వేటు
పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ అరెస్టు చేసిన 37 మంది భవిష్యత్తులో కమిషన్ పరీక్షలు రాసేందుకు వీలులేకుండా డీబార్ చేసింది.
టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన వారిపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 37 మంది అభ్యర్థులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. పేపర్ లీకేజీ కేసులో సిట్ అరెస్టు చేసిన 37 మందిని భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు అనుమతించమని స్పష్టంచేసింది. అయితే కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది.టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు సాగేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు.. సమాధానాలు తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించినట్లు సిట్ గుర్తించింది. లీకేజీకి పాల్పడిన అభ్యర్థులు చాట్ జీపీటీ ను వినియోగించినట్లు విచారణలో తేలింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం పేపర్లు కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ంఎ) సాంకేతికతను ఉపయోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రంలోకి రాగా ఏఐ టెక్నాలజీ ద్వారా సమాధానాలను గుర్తించి వారికి పంపిణీ చేసినట్లు గుర్తించారు.పెద్దపల్లిలో డివిజనల్ ఇంజినీర్గా పనిచేస్తున్న పూల రమేష్ (35)ను సిట్ అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ లీక్ అయిన మూడు ప్రశ్న పత్రాలను కాపీ చేసి, వాటిలో రెండిరటికి సమాధానాలు పొందడానికి టెక్నాలజీని వినియోగించాడని సిట్ గుర్తించింది. జనవరి 22, ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండు పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఈ సమాధానాలు అందించడానికి రమేష్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు బ్లూ టూత్ చెవిలో పెట్టుకుని పరీక్ష హాల్ కు వచ్చారు. పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత ఎగ్జామినర్ పేపర్ల ఫోటోలను తీసి రమేష్కు పంపినట్లు సిట్ తేల్చింది. మరో చోట తన నలుగురు స్నేహితులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాల కోసం చాట్ జీపీటీని ఉపయోగించాడు. ఆన్సర్స్ ను అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏడుగురు ఒక్కొక్కరు అర్హత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని సిట్ అనుమానిస్తుంది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు రమేశ్కు చాట్జీపీటీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, ముందే లీకైన పేపర్ ను పూల రవికిషోర్ నుంచి అందినట్లు సిట్ తేల్చింది. ఈ ప్రశ్నపత్రాన్ని రమేష్ 30 మందికి పైగా 25 లక్షల నుంచి 30 లక్షలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం.