కామన్‌ సివిల్‌ కోడ్‌

విశాఖపట్టణం, జూలై 7
న్నికలు దగ్గరపడే కొద్దీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే తన అవినీతి అక్రమాస్తుల కేసు, బాబాయ్‌ వివేకా హత్య కేసు రేపా మాపా అన్నట్లు టెన్షన్‌ పెడుతుంటే.. చెల్లి షర్మిల ప్రత్యర్థిగా రాష్ట్రంలో అడుగుపెడుతుందా? ఇన్నాళ్లు తనకు కేంద్రంలో సహకరించిన బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థి టీడీపీతో పొత్తుకు వెళ్తుందా అనే అనుమానాలు మెదడును తొలచి వేస్తున్నాయి.
ఇప్పటికే ప్రజలలో పెరిగిన వ్యతిరేకతకు తోడు ఒక్కసారి ఎన్నికల నగారా మోగితే.. పార్టీలో ఉండేది ఎవరో వెళ్ళేది ఎవరో అన్నట్లుంది పరిస్థితి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి మరో సమస్య వచ్చి పడిరది. అదే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు. అదే కామన్‌ సివిల్‌ కోడ్‌. ఈ బిల్లు జగన్‌ పాలిట ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది.ఎక్కడో కేంద్రం తీసుకొచ్చే బిల్లుతో రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డికి వచ్చిన నష్టం ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ బిల్లుకు వైసీపీ చచ్చినట్లు ఆమోదం తెలపాలి. ఈ నాలుగేళ్ళలో బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు, కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ ఎంపీలు మారు మాట్లాడకుండా ఒకే చెప్పి ఓట్లేశారు. అందుకే కేంద్రం నుండి జగన్‌ మోహన్‌ రెడ్డికి సహకారం అందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు కూడా వైసీపీ మద్దతు తెలపాల్సి వస్తుంది. అయితే.. ఈ బిల్లుకు వైసీపీ కనుక ఒకే చెప్తే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా మారతారు. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని హైలెట్‌ చేసి మైనార్టీలకు దగ్గరవుతాయి.ఇన్నాళ్లు వైసీపీ, బీజేపీ అనుబంధం రహస్యంగానే సాగిందని బహిరంగ రహస్యమే. అయితే దీని వలన జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. రాష్ట్రంలో కేంద్ర సంస్థల అమ్మకం, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవ్వని కేంద్రానికి వైసీపీ అండగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించినా వాటిని జగన్‌ పెద్దగా ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడు కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు విషయం మాత్రం మద్దతిస్తే ఒక తంటా మద్దతివ్వకుంటే మరో తంటా. ఆ బిల్లుకు మద్దతిస్తే వైసీపీకి చేటు జరగడం ఖాయం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టనుంది. దీనికి జగన్‌ మద్దతు ప్రకటించడం తప్పని సరి అవుతుంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపితే జగన్‌కు నష్టం జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు మద్దతు జగన్‌ కు ఎంతో కీలకం. కనుక ఆయన తప్పక ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు తెలపాల్సి ఉంటుంది.కానీ, ఈ బిల్లుకు జగన్‌ మద్దతు తెలిపితే రాష్ట్రంలో మైనార్టీలు దూరం అవడం గ్యారంటీ. ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని తమ మత స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా పేర్కొంటున్న ఈ సామాజిక వర్గం.. బిల్లుకు ఒకే చెప్పిన జగన్‌పై ఆగ్రహించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, తాము మాత్రమే కాకుండా.. అన్ని పార్టీలు ఉమ్మడి పౌరస్మృతికి జై కొట్టిన నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా వచ్చే ఇబ్బంది లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, కొన్నేళ్లుగా ముస్లింలు జగన్‌కు అండగా ఉంటుండగా.. ఇప్పుడు వారి అభిప్రాయానికి విరుద్ధంగా జగన్‌ నిర్ణయం తీసుకుంటే మాత్రం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *