పార్టీల వైపు స్టూడెంట్ లీడర్లు చూపు
వరంగల్, అక్టోబరు 4
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ యూనియన్ల నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు పార్టీల నుంచి పదుల సంఖ్యలో స్టూడెంట్ లీడర్లు టికెట్లను ఆశిస్తున్నారు. కొందరు ఢల్లీి స్థాయిలో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. ఓయూ వేదికగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల్లో చేరారు. కొందరు ఆయా పార్టీల సానుభూతిపరులుగా కొనసాగుతున్నారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో విద్యార్థి నాయకులకు పార్టీలు మొండిచేయి చూపించాయి. బీఆర్ఎస్? కొంతమందికి టికెట్లు, కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. కానీ, మిగిలిన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఉద్యమ నేతల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఓయూ నేతలే ఉన్నారు. సుమారు 20 మంది వరకూ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇలా పలువురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్ కూడా మరోసారి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. బీజేపీ తరఫున దేవరకొండ నుంచి కళ్యాణ్, మానకొండూరు నుంచి దరువు ఎల్లన్న, సూర్యాపేట/ కోదాడ నుంచి సురేష్ యాదవ్, తుంగతుర్తి నుంచి అంజిబాబు దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్ నుంచి ఉమాశంకర్, డొర్నకల్ నుంచి నెహ్రూ నాయక్ తో పాటు పలువురు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోపక్క బీఎస్పీలో చొప్పదండి నుంచి మంద రవీందర్ టికెట్లు ఆశిస్తున్నారు