నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్‌ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అతడి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్‌ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ శైవ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు.అతన్ని ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, విష్ణువర్ధన్‌, జెమిని గణేశన్‌, గిరీష్‌ కర్నాడ్‌, అర్జున్‌, నగేష్‌, రఘువరన్‌ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.అతను కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది.ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్‌ ఫేర్‌ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్‌ లో ప్రవేశించి ఏక్‌ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు 2020 ఆగస్టు 5 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కోవిడ్‌`19 వ్యాధి సోకినట్టు ప్రకటించాడు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబరు 25 న మధ్యాహ్నం 1.04 లకు బాలు తుదిశ్వాస విడిచాడు. 2020 సెప్టెంబరు 26న తిరువళ్ళూరు జిల్లాలోని రెడ్‌ హిల్స్‌, తామరపాకం లోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. 2021లోమరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *