చెన్నైలో ముగిసిన ఐపీఎల్ సందడి
చేపాక్ మైదానంలో ఈ ఏడాదికి ఐపీఎల్(IPL) సందడి ముగిసింది. మూడేళ్ల తరువాత తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీలకు విశేష ఆదరణ వచ్చింది. ఈ పోటీలకు అభిమానులు పెద్దఎత్తున నీరాజనం పలికారు. ప్రతి మ్యాచ్ సమయంలోనూ 40 వేల సామర్ధ్యం కలిగిన ఈ మైదానం క్రిక్కిరిసి కనిపించింది. సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రత్యర్ధులతో తలపడిన మ్యాచ్లు సహా క్వాలిఫయర్, ఎలిమినేటర్ పోటీలు ఈ మైదానంలో జరిగాయి. బుధవారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో లఖ్నవ్ సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ ఢీకొన్నాయి. సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కాకపోయినా, ఈ ఏడాదికి ఇదేచివరి మ్యాచ్ అన్న కారణంగా క్రికెట్ అభిమానులు గణనీయంగానే తరలివచ్చారు. ఒకటీరెండు గ్యాలరీలు ఖాళీగా దర్శనమిచ్చినప్పటికీ మిగిలిన గ్యాలరీలన్నీ కిటకిటలాడాయి. ఇతర రాష్ట్రాల అభిమానులు భారీగా తరలిరావడం విశేషం. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల అభిమానులు పెద్దసంఖ్యలో కనిపించారు. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అభిమానులు స్టేడియంలో అత్యధికంగా కనిపించారు.