ఇక నాలుగేళ్ల డిగ్రీ…

తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం(2023`24) నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచనున్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఉన్నత విద్యలో ఈ మేరకు మార్పులు చేయనున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. దీనిపై ఇటీవల యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి.యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులతో ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై చర్చ జరిగింది. నాలుగేళ్లపాటు కోర్సుల్లో విద్యార్థులు నిలవడం కష్టమని, అర్హులైన అధ్యాపకుల కొరత కూడా ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేశారు. అందుకే కొత్తగా ప్రవేశపెట్టనున్న బీఎస్‌సీ ఆనర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ను మూడేళ్ల కోర్సుగా నిర్ణయించామని తెలిపారు. దాన్ని నాలుగేళ్లకు పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రవేశపెట్టే కోర్సులను మాత్రం నాలుగేళ్ల వ్యవధితో తీసుకొచ్చే ఆలోచన చేస్తామని యూజీసీ ఛైర్మన్‌కు చెప్పారు. ఒకవేళ మూడేళ్లకే వెళ్లిపోతామని విద్యార్థులు అనుకుంటే జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఉన్నందున వారికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్లు చదివేవారికి ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వొచ్చని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.కంప్యూటర్‌ సైన్స్‌ ఆనర్స్‌ కోర్సును రాష్ట్రంలోని 10కిపైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెడతారు. ప్రైవేట్‌ కళాశాలలకు కూడా అనుమతిస్తారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీనిపై ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ డిగ్రీలో ఏటా 2.50 లక్షల మంది చేరుతున్నందున వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్ల కోర్సు వల్ల నేరుగా పీహెచ్‌డీలో చేరొచ్చని, విదేశీవిద్యకు వెళ్లేందుకు కూడా 16 సంవత్సరాల చదువు అవసరమైనందున ఆ ఇబ్బంది కూడా ఉండదన్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో.. బీటెక్‌ తరహాలోనే సైన్స్‌లో కూడా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఆ కోర్సును రెండేళ్లు ఇక్కడ.. మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలో పూర్తిచేసేలా అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. అలాగే బ్రిటన్‌, అమెరికా విశ్వవిద్యాలయాలతో కూడా ఇలాంటి ట్విన్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ` పీజీ) తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్కుమార్‌ వెల్లడిరచారు. తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన సూచించారు. సీయూఈటీ పీజీ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 19తో ముగియడంతో ఆ గడువును మే 5 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *