పొంగులేటి వర్సెస్‌ పువ్వాడ

పువ్వాడపై బచ్చాగాన్ని నిలబెట్టి గెలిపిస్తానని పొంగులేటి అంటే, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని పువ్వాడ కౌంటర్‌ ఇచ్చారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పువ్వాడపై నేను పోటీ చేయడం కాదు బచ్చాగాన్ని నిలబట్టి గెలిపిస్తానని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పొంగులేటికి కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పువ్వాడ. పొంగులేటి డబ్బు బలంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడిరచేందుకు కుట్ర చేశారని పువ్వాడ ఆరోపించారు. పొంగులేటికి ఓ సిద్ధాంతం, విలువ లేవన్నారు. తనను తాను అతి ఊహించుకుంటాడని పొంగులేటిపై ఫైర్‌ అయ్యారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పేదలను దోచుకుంటున్న దోపిడీదారులంతా పొంగులేటి పంచన చేరుతున్నారని విమర్శించారు.పొంగులేటి డబ్బులకు ఖమ్మం ప్రజలు అమ్ముడుపోరని మంత్రి పువ్వాడ అన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉండి బాగా సంపాదించి, అదే డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌ చాలా సార్లు చెప్పారని అయినా ఆయన తీరు మారలేదన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సాయంతో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంట్రాక్ట్‌ తీసుకుని పనులు చేయకుండానే వందల కోట్లు దోచేశారని విమర్శించారు. ఏ పార్టీలోకి చేరాలో తేల్చుకోలేక ఫ్రస్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాల్లో జనం లేకపోవడంతో ఫ్రస్టేషన్‌ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పువ్వాడపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మంత్రి అనుచరులు సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మనుషులను కూడా గౌరవించలేని వ్యక్తి పువ్వాడ అజయ్‌ అని పొంగులేటి అన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎంతటి వాడైనా ఇంట్లో కూర్చోవాల్సిందేనన్నారు. మంత్రి పువ్వాడను ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికారుల అండతో తన సభలను అడ్డుకునేందుకు మంత్రి పువ్వాడ ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మాటల గారడీతో మోసం చేసిన కేసీఆర్‌ కు రెండుసార్లు అధికారం ఇచ్చారన్నారు. అయితే మరోసారి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రైతులకు అందించే పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఒక్క రైతుబంధు మాత్రమే అందించి ఏదో గొప్పపని చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి ఆదాయం వచ్చే వాటిపై దృష్టి ఉంటుందే తప్పా, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *