ఫోక్‌ సింగర్‌ సాయిచంద్‌ మృతి

హైదరాబాద్‌, జూన్‌ 29
తెలంగాణ ఫోక్‌ సింగర్‌ సాయిచంద్‌ రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఫోక్‌ సింగరంగా చాలా ఫేమస్‌. ప్రస్తుతం ఆయన తెలంగాణ గిడ్డంగుల ఛైర్మన్‌గా ఉన్నారు. నిన్న రాత్రి నాగర్‌కర్నూలులో ఫ్యామిలీతో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి కారుకొండలోని తన ఫామ్‌లో హౌస్‌లో గడిపారు. ఆ టైంలోనే సాయిచంద్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని నాగర్‌కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఫ్యామిలీ మెంబర్‌. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స హైదరాబాద్‌ తరలించాలన్న వైద్యుల సలహాతో కేర్‌లో చేర్పించారు. ఆయన్ని బతికించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాత్రి మృతి చెందినట్టు కేర్‌ వైద్యులు ప్రకటించారు. సాయిచంద్‌ మృతి సంగతి తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. ఆసుపత్రిలో ఆయన్ని చూసేందుకు వచ్చిన మంత్రి హరీష్‌ కంటతడి పెట్టారు. ఇది చూసిన పార్టీ శ్రేణులు కూడా బోరున విలపించారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్‌ మరణం పట్ల సీఎం సంతాపాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ‘‘చిన్న వయస్సులో సాయిచంద్‌ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్‌ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్‌ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరం’’ అని సీఎం విచారం వ్యక్తం చేశారు.రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్‌ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్‌ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్‌ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటన్నారు సీఎం. శోకతప్త హృదయులైన సాయిచంద్‌ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు సీఎం కేసీఆర్‌. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌, తెలంగాణ ఉద్యమ కారుడు,గాయకుడు సాయిచంద్‌ హఠాన్మరణం తీవ్రంగా కలిచి వేసిందన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగిస్తోందని ప్రకటించారు. ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా బాల్కొండ బంగారు కొండ మా ప్రశాంత్‌ అన్న అని పిలిచే తమ్ముడు ఇక లేడంటే నమ్మలేక పోతున్న. తన ఆట,పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప స్ఫూర్తివంతమైన పాత్ర పోషించారు. సమాజానికే ఆదర్శంగా నిలిచిన సోదరుడు సాయి చంద్‌ భౌతికంగా దూరమైనా, గాత్రంతో సజీవంగా ఉంటారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అని ప్రకటన విడుదల చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుటూ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సానుభూతి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *