మహానగరానికి ఏమైంది…

హైదరాబాద్‌ లో కొద్ది రోజులుగా హైటెన్షన్‌ నెలకొంది. శాంతియుతంగా సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య చిచ్చు రేపడానికి కొన్ని శక్తులు కంకణం కట్టుకున్నాయి. హైదరాబాద్‌ ప్రశాంతతను కాపాడటానికి చాన్నాళ్ల తర్వాత ఆంక్షలు విధించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్‌ లో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. దేశంలో కొన్నిచోట్ల పరిస్థితుల అదుపు తప్పినా.. ఇక్కడి ప్రజలు మాత్రం సంయమనం పాటిస్తున్నారు. కానీ హైదరాబాదీలు ఇంత శాంతిగా ఉండటం కొందరు నేతలకు నచ్చడం లేదు. ఎలాగైనా అశాంతి చిచ్చు రేపాలని పైత్యపు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పౌరులే తిప్పికొట్టాల. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం కాదు.. ఇలాంటి నేతల్ని సమాజమే క్షమించదనే సంకేతం వెళ్లాలి. అప్పుడే పరిస్థితులు మారతాయి. మెట్రో నగరాల్లో ఉండాలంటే.. కొన్ని రూల్స్‌, రెగ్యులేషన్స్‌ పాటించాలనే చట్టాలు కూడా తేవాల్సిన అవసరం ఉంది. మెట్రో నగరాల పౌరులకు పరిణతి ఉన్నా.. నేతలు మాత్రం నేలబారు రాజకీయాలే చేస్తున్నారు. పౌరుల స్థాయికి ఎదగకపోగా.. వాళ్లను కూడా దిగజార్చడానికి వెనుకాడటం లేదు.హైదరాబాద్‌ లో ఓ కామెడీ షోను సాకుగా తీసుకుని.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఓ పథకం ప్రకారం వరుస పరిణామాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. కొందరు నేతలు తమ పైత్యపు వ్యాఖ్యలతో ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది.హైదరాబాద్‌ పోలీస్‌ వ్యవస్థను టెక్నాలజీ పరంగా ప్రభుత్వం ఆధునీకరించడంతో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది. ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పటిష్టమైన పెట్రోలింగ్‌తో బలమైన పోలీస్‌ వ్యవస్థ హైదరాబాద్‌ నగరంలో ఉంది. సోషల్‌విూడియాను వేదికగా చేసుకుంటూ కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని నెలకొల్పేందుకు పలు రకాలైన రెచ్చగొట్టే పోస్టులు వేస్తున్నారు. అలాంటి ప్రకటనలు, సోషల్‌విూడియా పోస్టింగ్‌లపై తరుచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై కేసులూ నమోదువుతున్నాయి. ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి. తమ వైఫల్యాలను దాచిపెట్టి.. ప్రజల దృష్టి మళ్లించడానికి కొందరు నేతలు ఆడుతున్న డేంజరస్‌ గేమ్‌.. నగర ఇమేజ్‌ ను దెబ్బతీసే అవకాశం ఉంది. కేవలం విద్వేషం, వివాదాల విూదే ఆధారపడి రాజకీయం చేస్తున్న నేతల్ని దూరం పెట్టి.. మన హైదరాబాద్‌ ను మనమే కాపాడుకోవాలి. 400 ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యనగరం.. కేవలం నలుగురు వ్యక్తుల కారణంగా.. నలుగురి నోళ్లలో నాని.. నవ్వులపాలయ్యే పరిస్థితి రాకూడదు. దశాబ్దాల తరబడి ఫోకస్‌ పెడితే కానీ.. హైదరాబాద్‌ ఇప్పుడున్న స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు.. విశ్వనగరం దిశగా దూసుకుపోతున్న నగరానికి మంచిది కాదు. నేతల నుంచి పరిణతి ఆశించడం అత్యాశే అని రుజువైంది. కాబట్టి ప్రజలే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.తాజా ఘర్షణలతో పాతబస్తీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కంప్యూటర్‌ యుగంలో పుట్టిన నేటి తరానికి అసలు ఇలాంటి సీన్లు పరిచయం కూడా లేదు. సోషల్‌ విూడియాలో కూడా స్వేచ్ఛ కావాలని కొట్లాడుతున్న రోజుల్లో.. మన నగరంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోవడం అందరికీ దురదృష్టకరం. ఎవరో ఏదో మాట్లాడగానే రెచ్చిపోవడం, అల్లర్లు చేయడం, రాళ్లు రువ్వడం లాంటి ఘటనలకు యువత దూరంగా ఉండాలి. నిన్నటి తరం చవిచూసిన చేదు అనుభవాలు మళ్లీ రిపీట్‌ కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా శాంతి నెలకొల్పడం చాలా కష్టం. అశాంతి రేపడం చాలా తేలిక. కోటి మందికి పైగా వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రజలకు జీవికగా ఎదిగిన హైదరాబాద్‌ పై చేస్తున్న కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టాలి. తాము అభివృద్ధి, ఉద్యోగాలు, మౌలిక వసతులు లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలకే స్పందిస్తాం కానీ.. చిల్లర వేషాలకు స్పందించబోమనే సందేశం బలంగా వెళ్లాలి. అప్పుడే నోటిదురుసు నేతల నోటికి తాళం పడుతుంది.దేశంలో 8 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. అసలు మెట్రో కల్చర్‌ ఏంటో కనీస అవగాహన లేని నేతలు చేస్తున్న పనులు.. పరోక్షంగా కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నాయి. మామూలు నగరాలకు లోకల్‌ గానే గుర్తింపు ఉంటుంది. కానీ మెట్రో నగరాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్‌ లో చీమ చిటుక్కుమన్నా.. అన్ని దేశాలకూ వార్త వెళ్లిపోతుంది. మెట్రో నగరంగా ఎదగడం కంటే.. ఆ ఇమేజ్‌ కాపాడుకోవడం చాలా కష్టం. ఈ కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న నేతలు.. హైదరాబాద్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నవతరం ప్రతిభతో వెలుగులీనతున్న హైదరాబాద్‌ ను.. తమ తప్పుడు పనులు, వ్యాఖ్యలతో భ్రష్టు పట్టిస్తున్నారు. నేతల రాజకీయం గల్లీలకే పరిమితం. కానీ హైదరాబాద్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం. రాజకీయం కోసం దిగజారి చేస్తున్న వ్యాఖ్యలు, కుట్రపూరితంగా వేస్తున్న స్కెచ్‌ లు కొంపలు ముంచే ప్రమాదం ఉంది. వీటిని ఆదిలోనే అరికట్టి జాగ్రత్తపడకపోతే.. నగరం పరువు పోతుందని పౌరులు ఆందోళన చెందుతున్నారు.హైదరాబాద్‌ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిరది. గతంలో శాంతిభద్రతలు అదుపుతప్పినప్పుడు కూడా నగరం తన ఇమేజ్‌ పెంచుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా కొందరు నేతల పైత్యం.. భాగ్యనగరం భవిష్యత్తును నిర్ణయించలేదనే మాట నిజం. హైదరాబాద్‌ బ్రాండ్‌ చెడగొట్టాలనుకోవడం.. సూర్యుడిపై ఉమ్మి వేసినట్టే ఉంటుంది. నేతలు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని.. హైదరాబాద్‌ ప్రతిష్ఠకు భంగం కలగకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలే అలాంటి నేతల్ని నగర బహిష్కరణ చేయాల్సిన సందర్భం కూడా వస్తుంది.హైదరాబాద్‌ లో వేలాదిగా కంపెనీలున్నాయి. కోట్లాది మందికి ఉద్యోగాలొస్తున్నాయి. కరోనా టైమ్‌ లో కూడా మిగతా మెట్రో నగరాల కంటే బెటర్‌ గా హైదారాబాద్‌ లో ఉద్యోగాలొచ్చాయి. ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ లు హైదరాబాద్‌ లో నెలకొల్పాయి. ఇన్ని ప్రత్యేకతలున్న నగరంలో శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నీమధ్యే హైదరాబాద్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటైంది. ఓవైపు శాంతిభద్రతల కోసం ఇంత ప్రయత్నం జరుగుతోంటే.. మరోవైపు నేతలు నక్కజిత్తులతో విషపూరిత వాతావరణం కల్పించడం ఎవరూ సహించే పరిస్థితి ఉండకూడదు.దేశంలో మరే మెట్రో నగరానికీ లేని ప్రత్యేక చరిత్ర హైదరాబాద్‌ సొంతం. గతంలో అయినా.. ఇప్పుడైనా హైదరాబాద్‌ ఎప్పుడూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఈ ప్రత్యేకత కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాదీలందరిపైనా ఉంది. ఈ కాలంలో కూడా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే అలవాటు ఉండం మంచిది కాదు. నవీన యుగంలో మధ్యయుగాల నాటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే. ఒక వ్యక్తిని దెబ్బతీస్తే అతడి కుటుంబానికి నష్టం. కానీ హైదరాబాద్‌ లాంటి నగరం బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటే.. అది కోట్ల మందికి నష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తపడాలి. అదుపుతప్పుతున్న నేతల్ని అదుపుచేయాలి. అసలు ఇలాంటి పనులు చేయాలనే ఆలోచన రావడానికే భయపడేలా బుద్ధి చెప్పాలి.హైదరాబాద్‌ వేగవంతమైన అభివృద్ధికి తమ వంతు చేయూత అందించాల్సి నేతలు.. స్వార్థ రాజకీయల కోసం ఎంతకైనా దిగజారటం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్‌ లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ కు కూడా ఎసరు పెట్టేలా చేస్తున్న కుట్రల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పాలకులు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్థిరమైన అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌ ను కొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేయటం ప్రమాదకరం.లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. నిత్యం అశాంతి రగిలే చోట ఎక్కడా నాగరికత వికసించలేదు. శాంతియుతంగా ఉన్న నగరాలే రేసులో ముందున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ లో జరుగుతున్న ఘటనలు ఎవరికీ మంచిది కాదు. కనీస బాధ్యత లేకుండా కొందరు నేతలు చేస్తున్న పనులు.. హైదరాబాద్‌ కు చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ల నుంచి కష్టపడి నిర్మించుకున్న బ్రాండ్‌ హైదరాబాద్‌ ను కొందరు కూలగొడుతుంటే.. చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకూడదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *