యువ ఓటర్లే కీలకం…

హైదరాబాద్‌, అక్టోబరు 10
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేవి మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం ఏడు లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా… 35ఏళ్లలోపు ఓటర్లు 30శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని 3.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఏడు లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వారే. అలాగే, 75 లక్షల మంది ఓటర్లు 19 నుంచి 35 ఏళ్ల మధ్య వారే ఉన్నారు2014, 2018లో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక కర్ణాటక విజయం సాధించిన కాంగ్రెస్‌.. తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక… కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్‌, అప్పటి టీఆర్‌ఎస్‌… 119 స్థానలకుగాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. అప్పుడు కూడా 119 స్థానలకుగాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇక, ఎంఐఎం ఏడు, ఇండిపెండెంట్లు రెండు, బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 46.87శాతం ఓట్లును సాధించింది. ఇక… కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చినా 28.43శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచినా… బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో గెలుపెవరిది అన్నది.. ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకున్నా… ఈసారి స్పష్టమైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా… కేసీఆర్‌ మ్యాజిక్‌ ముందు నిలబడలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీజేపీ గ్రాఫ్‌ పెరగడం కూడా అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది. మరి… ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది.ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ కంటే సీఎం కేసీఆర్‌ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు. పార్టీ అభ్యర్దులను ముందుగానే ఖరారు చేసేశారు. 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగా… మరికొందరిని అధిష్టానం బుజ్జగించింది. దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా ఒక కొలిక్కివచ్చింది. మరోవైపు… ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌ ముందే ఉంది. సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతతో ప్రజలకు కాస్త దూరంగా ఉన్నా… మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీ.. ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఇప్పటికే గ్యారెంటీ స్కీమ్‌లు ప్రకటించింది. ఆ గ్యారెంటీ స్కీములపైనే ఆశలు పెట్టుకుంది. అయితే సీఎం కేసీఆర్‌.. దీనికి కూడా కౌంటర్‌ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీ స్కీములను మించిన పథకాలతో మేనిఫెస్టో తీసుకురాబోతున్నారు. ఈనెల 16న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. పాజిటివ్‌ ఓట్‌ బ్యాంక్‌నే నమ్ముకున్నారు సీఎం కేసీఆర్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *