నిమ్మల రామనాయుడు వినూత్ననిరసన

ఏలూరు, జూలై 4
టిడ్కో ఇళ్లు తాము నిర్మించామని ప్రతిపక్ష టీడీపీ నేతలు చెబుతున్నారు. పేదల కోసం ఇళ్లు కట్టించి ఇస్తున్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే తమ హయాంలోనే టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి చేశామని, సీఎం జగన్‌ చేయడానికి ఇంకేం ఉందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మిగతా చిన్న చిన్న పనులు పూర్తి చేసి టిడ్కో ఇళ్లను పేదలకు అందించడం కూడా చేతగాని ప్రభుత్వం ఏపీలో ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల వ్యవహారంపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇంటింటికి వెళ్లి పేపర్‌ వేసి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.టీడీపీ హయంలో టిడ్కో ఇళ్లు 90% పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో మిగిలిన 10% పనులు పూర్తి చేయకపోవడం పై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలియజేస్తున్నారు. మహిళల సొంతింటి కల నెరవేర్చే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామంటూ, టీడీపీ ఎమ్మెల్యే ఉదయమే ఇంటింటికి వెళ్లి పేపర్‌ వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఉచితంగా ఇస్తామని చెప్పి నేడు బ్యాంకులకు తాకట్టు పెడుతున్న ఏపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్ళు తెరిచి స్పందించాలని కోరారు.సైకిల్‌ పై వీధుల్లో తిరుగుతూ టిడ్కో ఇల్లు ఇచ్చారా అని మహిళలను అడిగారు. అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తి సమస్యలు చూడలేక.. పేదల బాధలను సీఎంకు తెలపాలని తన ప్రయత్నం అన్నారు. పేదల కన్నీళ్లు చూడలేక, పొద్దున్నే తాను లేచి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పేపర్‌ వేస్తున్నానని చెప్పారు. చెమటలు కక్కుతూనే సైకిల్‌ పై తిరిగి, టిడ్కో ఇళ్లపై ప్రచారం చేస్తూ ఇదేం కర్మరా బాబు అని ప్రచారం చేశారు. కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టవద్దు. పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రంగులు వేయడం కాదు, మిగిలిన 10 శాతం ఇళ్లు పూర్తి చేయాలని ప్లకార్డులతో సైకిల్‌ పై తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు ఎమ్మెల్యే రామానాయుడు.
ఎమ్మెల్యేగా ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చున్న ఇబ్బంది లేదని, కానీ పేదలకు ఇళ్ల కోసం ఆయన శ్రమిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు సొంతింటి కల సాకారం చేసేందుకు టీడీపీ 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా, జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా మిగతా 10 శాతం నిర్మాణం పూర్తి చేయలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *