48 విమానాలు రద్దు చేసిన పాకిస్థాన్.. ఎందుకంటే?

కరాచీ: పాకిస్థాన్ లోని విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) 48 విమానాలను రద్దు చేసింది. ఇంధనం(Fuel) అందుబాటులో లేని కారణంగానే వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పీఐఏ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. పరిమిత ఇంధన సరఫరా వల్ల దేశంలో విమానాలు నడపలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానాల్ని రద్దు చేసినట్లు వివరించారు. మరి కొన్నింటిని రీషెడ్యూల్ చేశామన్నారు. రద్దైన విమానాల్లో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయని.. 13 దేశీయ, 11 అంతర్జాతీయ విమానాలు రద్దు చేశామని, మరో 12 విమానాలు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వారికి ఏమైనా సమస్యలుంటే పీఐఏ కస్టమర్ కేర్, కార్యాలయాలు లేదా ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించాలని సూచించారు.

ఇంధన కొరత ఎందుకు?
ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ (PSO) బకాయిలు చెల్లించని కారణంగా సరఫరాను నిలిపేసింది. దీంతో పీఐఏ విమానాలకు ఇంధన కొరత ఏర్పడింది. పేరుకుపోయిన అప్పుల కారణంగా ఇప్పటికే పతనం అంచున ఉండి, ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న విమానయాన సంస్థ భవిష్యత్తు ఇప్పుడు మరింత అగమ్యగోచరంగా మారింది. జాతీయ విమానయాన సంస్థ ప్రభుత్వానికి సాయం కోసం అభ్యర్థించినప్పటికీ గవర్నమెంట్ నిరాకరించడంతో సంస్థ పరిస్థితి మరింత జటిలంగా మారంది. ఇంధనం కొనేముందుగానే నగదు చెల్లింపులు జరపాలని పీఎస్ఓ షరతు విధించడంతో భవిష్యత్తులో మరిన్ని విమానాలు రద్దు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాయాది దేశం రాజకీయ అస్థిరతతో పాటు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరుకుంది. ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ కరెన్సీ విలువ దాదాపు సగానికి పడిపోయింది.

విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. సెప్టెంబరులో, దేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటాయి. ప్రధాని అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలను లీటరుకు రూ.14.91, రూ.18.44 చొప్పున పెంచింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరింది. పెరుగుతున్న కరెంటు బిల్లులపై పాకిస్థాన్‌లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముల్తాన్, లాహోర్, కరాచీ, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)తో సహా పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 8 లక్షల మందికి పైగా దేశం విడిచి వెళ్లింది . వారిలో లక్ష మంది ఉన్నత శిక్షణ పొందిన నిపుణులు ఉన్నారు, మొత్తంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, పెరిగిన ద్రవ్యోల్బణంతో ఆ దేశం అల్లాడుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *