కరీంనగరంలో ఇసుక కష్టాలు

రాష్ట్రంలో కొత్త ఇల్లు కట్టుకునేవాళ్లను ఇసుక కష్టాలు వెంటాడుతున్నాయి. మెజార్టీ ఏరియాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ నిర్మాణాలకు లోకల్‌ వాగుల ఇసుకే దిక్కవుతోంది. గోదావరి, కృష్ణా ఇసుకకు ఎక్కువ రేటు ఉండడం, అందులో దొడ్డు ఇసుక రాకపోవడంతో స్థానిక వాగుల్లోని ఇసుకనే తరలిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక పర్మిట్లను స్థానిక తహసీల్దార్లు, ఆర్డీఓలు ఇస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చాలాచోట్ల రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు కుమ్మక్కయి ట్రాక్టర్ల యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వ పనుల ముసుగులో పర్మిట్లు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా జరిగే ఇసుక రవాణా అంతా ఇల్లీగల్‌ గానే నడుస్తోంది. ఇసుక రీచ్‌ లు ఉన్న జిల్లాల్లో తప్పా మిగతా జిల్లాల్లో సామాన్యులకు ఇసుక దొరకడం గగనమైంది. నదులు, వాగులు లేని ఏరియాల్లో ఇసుక దొరకడమే కష్టంగా మారింది. ఇసుక రీచ్‌ లు ఉన్న జిల్లాల్లో స్థానిక వాగుల నుంచి తెచ్చుకుందామంటే రెవెన్యూ, పోలీసుల భయం.. గోదావరి, మానేరు, కృష్ణా నదుల్లోని రీచ్‌ ల నుంచి వచ్చే ఇసుకను కొనాలంటే వ్యాపారులు చెప్తున్న ధరలు సామాన్య నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా మానేరు, గోదావరి సాండ్‌ రీచుల్లోని ఇసుకను కేవలం హైదరాబాద్‌ సిటీ, దాని చుట్టుపక్కల ఏరియాలకే ఎక్కువగా తరలిస్తుండడంతో..ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టేవారికి ఇసుక దొరకడం లేదు. దీంతో రెవెన్యూ, పోలీసులకు మామూళ్లు ముట్టజెప్తూ వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ఓనర్లు.. ఒక్కో ట్రిప్పుకు దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ గా మారిన ఇసుకను సామాన్యుల ఇంటి వద్దకే ట్రాక్టర్లలో సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎండీసీ) ద్వారా 2019 జూలై 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ పేరుతో కొత్తపాలసీని అమలు చేస్తోంది. మన ఇసుక వాహనం పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ లో ఇసుకను బుక్‌ చేసుకుంటే ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ట్రాక్టర్‌ ట్రిప్పు ఇసుక(3క్యూబిక్‌ విూటర్లు)కు దూరాన్ని బట్టి రూ.2600 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తోంది. అయితే ఈ పోర్టల్‌ కేవలం ఇసుక రీచ్‌ లు దగ్గర్లో ఉన్న 12 జిల్లాలకే పరిమితమైంది. ఇందులో కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, జోగులాంబ గద్వాల, మహబూబ్‌ నగర్‌, నారాయణపేట్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ జిల్లాల్లోనూ కొన్ని మండలాల ప్రజలకు ఇసుక బుక్‌?చేసుకునే ఆప్షన్‌ కనిపించడం లేదు. మరో 21 జిల్లాల పేర్లయితే అసలు పోర్టల్‌ లోనే కనిపించడం లేదు. దీంతో ఇసుక అవసరాలున్న ఆయా జిల్లాల ప్రజలు బ్లాక్‌ లో కొనుగోలు చేస్తున్నారు. లేదంటే సవిూప వాగుల్లో అనుమతి లేకుండా దొడ్డిదారిన తరలించే ఇసుకను ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇసుక బుకింగ్‌, అమ్మకాల ప్రక్రియ అంతా ఆన్‌ లైన్‌ లో జరుగుతున్నప్పటికీ.. లారీ ఓనర్లు, ఇసుక డంప్‌ లు నిర్వహించే రిటైలర్లు చెప్పిందే రేటు. మన ఇసుక వాహనం అందుబాటులో లేని 21 జిల్లాల్లో సామాన్యుడు సాండ్‌ పోర్టల్‌ లో ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకుని ఇసుక రీచ్‌ ల నుంచి కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఈ వ్యవహారమంతా లారీల ఓనర్లే నడిపిస్తున్నారు. ఇసుక బుకింగ్స్‌ కోసం వీరు ప్రత్యేక టీమ్‌ లనే పెట్టుకున్నారు. రోజూ టీఎస్‌ఎండీసీ ఎన్ని క్యూబిక్‌ విూటర్ల ఇసుక అందుబాటులో ఉందో ప్రకటించగానే.. వీళ్లు బుక్‌ చేస్తారు. ఇందుకుగాను ఒక్కో బుకింగ్‌ కు రూ.500 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఇలా ఇసుక రీచ్‌ ల నుంచి తరలించిన ఇసుకను డంపింగ్‌ యార్డులకు చేర్చి భవన నిర్మాణదారులకు టన్నుల చొప్పున అమ్ముతున్నారు. ఒక్కో టన్నుకు రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరగడం, ఆఫీసర్లకు ఇవ్వాల్సిన మామూళ్ల కారణంగానే గత్యంతరం లేక ఇసుకను ఎక్కువ రేటుకు అమ్మాల్సి వస్తోందని లారీల ఓనర్లు చెప్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *