నాలుగు నెలల్లో నిమ్స్ 50 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు
ర్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం సాధ్యం కాని ఘనత సాధించి 50 మంది జీవితాల్లో నిమ్స్ వెలుగులు నింపింది. అరోగ్య శ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో ఒక్కో పేషెంట్ కు రూ. 15 లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించింది. ఈ నేపథ్యంలో నిమ్స్ వైద్యులను అభినందించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అభినందించారు. ‘సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఖరీదైన వైద్యం పేదలకు చేరువైంది. తద్వారా ఎంతో మంది బాధితులకు పునర్జన్మ లభిస్తున్నది..’ అని చెప్పారు.ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో రోగికి రూ. 15 లక్షల విలువైన ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తున్నది. నిమ్స్ తో పాటు గాంధీ, ఉస్మానియాల్లో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాల మార్పిడి సర్జరీలను ప్రభుత్వం అరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు (522 లైవ్, 340 కాడవర్ కేసులు) జరిగాయి.2015 నుండి, ప్రతి సంవత్సరం సగటున 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. గత ఏడాది 2022లో 93 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్ధన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ను అతి తక్కువ సమయంలో చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ వైద్యులు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లతో పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర యూరాలజీ శస్త్రచికిత్సలను కొనసాగిస్తున్నారు.నిమ్స్ యూరాలజీ టీమ్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, డాక్టర్ సి.హెచ్.రామ్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.విద్యా సాగర్, డాక్టర్ జి.రామచంద్రయ్య, డాక్టర్ జి.వి.చరణ్ కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ అరుణ్కుమార్, డాక్టర్ సునీల్, డాక్టర్ వినయ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ జానకి, డాక్టర్ పవన్, డాక్టర్ హర్ష, డాక్టర్ పూవర్సన్, డాక్టర్ సూరజ్, డాక్టర్ షారుఖ్, డాక్టర్ అనంత్, అనస్తీషియా బృందం డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిర, డాక్టర్ కిరణ్, డాక్టర్ షీబాని, నెఫ్రాలజీ బృందం డాక్టర్ టి. గంగాధర్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ జి.స్వర్ణలతలు ఇందుకు కృషి చేసిన వారిలో ఉన్నారు.అత్యంత ఖరీదైన వైద్యం పేదలకు చేరువయ్యిందని, తద్వారా అనేక మంది అవయవ మార్పిడి బాధితులకు పునర్జన్మ లభిస్తుందని హరీష్ రావు కొనియాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది పూర్తయితే సేవలు మరింత విస్తృతం అవుతాయి. ఆర్గాన్ డొనేషన్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. అవయవదానం ప్రోత్సహించి, జీవన్ దాన్లో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్న వారికి నిండైన జీవితం అందించాలని పిలుపునిస్తున్నాను..’ అని పేర్కొన్నారు.