నితీష్‌, కేసీఆర్‌ భేటీలు..

ఇద్దరు సీఎంల కలయిక జాతీయ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందా? బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్‌.. బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌లు.. రానున్న రోజుల్లో కలిసి సాగుతారా? తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తరహాలో పాట్నాలో జేడీయూ పోస్టర్లు సంచలనంగా మారాయి.పాట్నాలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత చర్చల్లో ఉన్న ప్రశ్నలివే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇటీవలే ప్రగతి భవన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. త్వరలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌ బీహార్‌కు వెళ్లడం.. అక్కడ సీఎంతోపాటు డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్‌ఎస్‌, జేడీయూ.. ఆర్జేడీ పార్టీలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ఈ కలయిక రానున్న రోజుల్లో పెను రాజకీయ చర్చకు దారితీయొచ్చనే చర్చ నడుస్తోంది.దేశ తాజా రాజకీయ పరిస్థితులపై బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించినట్టు తెలుస్తోంది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల కంటే ముందుగానే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం. బీహార్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ అంశంపైనా సమాలోచనలు చేశారట. ప్రధాని మోడీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. వీటికి రాజకీయంగా ఎలా అడ్డుకట్ట వేయడం.. తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలపై ఇద్దరు సీఎంలు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.ప్రధాని మోడీని ఢీకొట్టే బలమైన నేత కోసం జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాయి. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోపాటు బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పేరు కూడా చర్చల్లో ఉంది. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్‌ నేతృత్వం వహించే విశ్లేషణలు నడుస్తున్నాయి. గతంలో కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై వివిధ జాతీయ పక్షాలతో సమాలోచనలు చేశారు. పాట్నాలో తాజా సమావేశంలో ఈ దిశగా ముందడగు పడుతుందా? కార్యాచరణ ఏంటి అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.బిహార్‌లో నిరూపించాం ఇక దేశంలో సత్తా చాటుతామని సీఎం నితీష్‌ కుమార్‌ ఫోటోలతో వెలిసిన ఫ్లెక్సీలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. జేడీయూ కార్యాలయం వెలుపల ఉంచిన పోస్టర్‌లో నితీష్‌ కుమార్‌ ఫోటోతో పాటు ‘ప్రదేశ్‌ మే దిఖా, అబ్‌ దేశ్‌మే దిఖేగా’ (ఇది ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది, ఇది దేశంలో కనిపిస్తుంది) అని ఉంది. మరొక పోస్టర్‌లో ‘జుమ్లా నహీ హకికత్‌ హై’ (అబద్ధాలు మాత్రమే వాస్తవం కాదు), ‘ఆశ్వాసన్‌ న్హీ సుసాషన్‌’ (హావిూ లేదు కానీ సుపరిపాలన) అని పేర్కొంటూ పాట్నా అంతటా ఐదు కొత్త పోస్టర్లు వెలిశాయి.గతంలో బీజేపీ తీరుపై టీఆర్‌ఎస్‌ ఇదే తరహాలో పోస్టర్‌ వార్‌ నడిపింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంలో మోడీ గో బ్యాక్‌ అంటూ బీజేపీ విధానాలను విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ వార్‌ కొనసాగించింది. జేడీయూ జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశం కూడా సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో జరగడం గమనార్హం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ టూర్‌ తర్వాత బిహార్‌లో ఈ తరహా పోస్టర్లు దర్శనం ఇవ్వడం సంచలనంగా మారింది. వీటి వెనుక కేసీఆర్‌ ఎత్తుగడ ఉందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.వాస్తవానికి జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే విషయంలో విపక్ష పార్టీల మధ్య లుకలుకలు ఉన్నాయి. వివిధ సందర్భాలలో బీజేపీ పట్ల ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అది స్పష్టమైంది కూడా. బీజేపీని ఢీకొట్టాలంటే విపక్షపార్టీలను ఒక్కమాటపై ఉంచడం పెద్ద సవాల్‌. వాటికి సీఎంలు కేసీఆర్‌, నితీష్‌ కుమార్‌ చొరవ తీసుకుంటారా అనేది ప్రశ్న. దానికి ఈ భేటీలో స్పష్టత వస్తుందా.. మరికొన్ని సమావేశాలు ఉంటాయా అనేది తెలియాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *