పేస్ బలమెంత?
వెస్టిండీ్సతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును పరిశీలిస్తే ఓ విషయమైతే స్పష్టమవుతోంది. సంధి దశను అధిగమించేందుకు వెటరన్ ఆటగాళ్లను మెల్లగా పక్కనబెట్టి.. యువ రక్తాన్ని ఎక్కించాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే కొన్నేళ్లుగా టెస్టు జట్టుకు మూలస్తంభంలా నిలిచి.. నయా వాల్గా పిలిపించుకున్న చటేశ్వర్ పుజార, సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్లను పక్కకు తప్పించి యువ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్లకు కొత్తగా చోటు కల్పించారు. అలాగే పేసర్ నవ్దీప్ సైనీకి చాలా రోజుల తర్వాత పిలుపు అందింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. విండీ్సతో సిరీ్సకు పేస్ దళాన్ని పరిశీలిస్తే కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. మహ్మద్ షమికి విశ్రాంతినివ్వడంతో మరో పేసర్ మహ్మద్ సిరాజ్పైనే అధిక భారం పడనుంది. అదే 2021-23 డబ్ల్యూటీసీని పరిశీలిస్తే.. బుమ్రా, షమి, సిరాజ్లతో పాటు ఇతర బౌలర్లు కూడా సిద్ధంగా ఉండేవారు. బుమ్రా గాయంతో దూరమైనప్పుడు శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉనాద్కట్, సైనీ, ముకేశ్ కుమార్లాంటి పేసర్లు తమ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నా వీరికి అనుభవం లేదు. వీరంతా కూడా చివరి డబ్ల్యూటీసీ సైకిల్లోనూ తమ వంతు కోసం వేచి చూసినవారే. ఈసారి వీరికి తగిన అవకాశం సెలెక్టర్లు కల్పించవచ్చు.
దులీప్ ట్రోఫీ చక్కటి చాన్స్
ఈనెల 28న బెంగళూరులో ఆరంభమయ్యే దులీప్ ట్రోఫీ పేసర్ల సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. భవిష్యత్లో జట్టుకు ఉపయోగపడేలా ఎవరిని తీర్చిదిద్దాలనే విషయమై సెలెక్టర్లు ఓ అంచనాకు రావచ్చు. ఈ జోనల్ టోర్నీలో పాల్గొనే ఆయా జట్లలో కవేరప్ప, వైషాక్, యష్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అర్జాన్, చేతన్ సకారియా, ఇషాన్ పోరెల్ రూపంలో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇందులో రాణించి భారత్ ‘ఎ’ జట్లకు ఎంపిక కావాలని వారంతా చూస్తున్నారు. మరోవైపు అర్ష్దీప్ సింగ్ను పరిమిత ఓవర్ల బౌలర్గా చూస్తున్నారు కానీ అతను కూడా సుదీర్ఘ ఫార్మాట్కు పనికివచ్చే పేసర్ అని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం అతను కౌంటీ మ్యాచ్లలో ఆడుతుండడం విశేషం.
తగిన బ్యాకప్ ఉందా?
ఒకవేళ ప్రస్తుత పేసర్లు గాయాలతో అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరంగానే ఉంది. ఎంతమంది దేశవాళీ పేసర్లకు జాతీయ జట్టులోకి రాగలిగే సత్తా ఉందంటే చెప్పడం కష్టం. ఇందులో అవేశ్ ఖాన్ ఒక్కడే రాబోయే డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడగలిగే పేసర్గా ఆశలు కల్పిస్తున్నాడు. ఇక చివరి రెండు రంజీ సీజన్లలో బౌలింగ్ తీరును పరిశీలిస్తే ఎక్కువగా స్పిన్నర్ల ఆధిపత్యమే కనిపించింది. టాప్-10లో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో అవేశ్ (8 మ్యాచ్ల్లో 38 వికెట్లు, మధ్యప్రదేశ్)తోపాటు బల్తేజ్ సింగ్ (8 మ్యాచ్ల్లో 37, పంజాబ్), ఆకాశ్దీ్ప (10 మ్యాచ్ల్లో 41, బెంగాల్) మెరుగ్గానే రాణించారు. కానీ వీరిని నేరుగా టీమిండియాలోకి తీసుకునే అవకాశం లేదు. భారత ‘ఎ’ జట్టుకు ఎంపిక చేసి పరీక్షిస్తేనే ఓ నిర్ధారణకు రావచ్చు. అలాగే బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల 32 ఏళ్ల బల్తేజ్ ముందు తన ఫిట్నె్సను కాపాడుకోవాల్సి ఉంటుంది.
భారత్ ‘ఎ’ టూర్లు అవసరం
బీసీసీఐ కూడా వర్ధమాన బౌలర్లను టెస్టు ఫార్మాట్ కోసం తీర్చిదిద్దేలా ఓ రోడ్మ్యాప్ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భారత ‘ఎ’ జట్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ జట్లకు ఎంపికైతే తమ సత్తా నిరూపించుకునేందుకు తగిన అవకాశం లభించినట్టవుతుందని యువ పేసర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి విదేశీ జట్లలో టాప్ ఆటగాళ్లు బరిలో ఉంటారని, వారితో తలపడినప్పుడు తమలోని అత్యుత్తమ ఆటతీరు బయటికి వస్తుందని గుర్తుచేస్తున్నారు. అంతకంటే ముందు తాము టెక్నికల్గా రాటుదేలడమే కాకుండా మానసికంగానూ దృఢంగా మారే వీలుంటుందని చెప్పారు. అటు బీసీసీఐ కూడా వీలైనంత ఎక్కువగా భారత్ ‘ఎ’ జట్లను పర్యటనలకు పంపించడం ద్వారా.. అత్యవసర సమయంలో టీమిండియాకు సేవలందించేందుకు పేస్ బలగాన్ని సిద్ధం చేసినట్టవుతుంది.