విజయవాడలో మహాలక్ష్మీ యాగం…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంక్షేమం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగాన్ని చేస్తున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. మే 12 నుంచి మే 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మహా యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాగానికి సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలిసి దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ పరిశీలించారు. రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండేలా, ప్రజలు సౌభాగ్యంతో జీవించేలా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ఎంతో పవిత్రమైన ఈ యజ్ణాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈ మహా క్రతువు మే 12వ తేదీ ఉ.5గం.లకు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రారంభమవుతుందన్నారు. ప్రధానంగా నాలుగు యాగశాలలు ఉంటాయని, ఒక్కో యాగ శాలలో 108 కలశాలతో యాగం జరుగుతుందన్నారు. ఈ యాగ కార్యక్రమాల్లో 520 మందికిపైగా రుత్వికులు పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు యాగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీటితోపాటు ప్రతి రోజు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ వంటి ప్రవచనకర్తలు కూడా పాల్గొని ప్రజలకు వివిధ ప్రవచనాలు ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ తదితర అంశాలను తెలియజేస్తారని దేవాదాయశాఖ కమిషనర్‌ తెలిపారు. స్వరూపానందస్వామి, చినజీయర్‌ స్వామి, కుర్తాళ సిద్ధేశ్వర, మంత్రాలయ, జగద్గురు పండితారాధ్య తదితర పీఠాధిపతులు కూడా పాల్గొంటారన్నారు. యాగశాలల లోపలికి ఎవరికీ అనుమతి ఉండదని, మే 17 తేదీన చివరి అంకంలో భాగంగా పూర్ణహుతి ఉంటుందన్నారు. యాగం నిర్వహణకు దాదాపు రూ.5 కోట్లు వ్యయం అవుతుందన్నారు.ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని దీని కోసం 13 కమిటీలు పని చేస్తాయన్నారు. ట్రాఫిక్‌, ప్రోటోకాల్‌ వంటి అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ సూచనలు, సలహాలు అమలు చేస్తామన్నారు. ఆరు రోజుల పాటు జరిగే యాగానికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అధిగమించి, సంక్షేమాన్ని ఆశిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించటం ఇదే ప్రప్రథమం. అందుకే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హజరయ్యే అవకాశం ఉంది. అయితే సీఎం షెడ్యూల్‌ ఇంకా నిర్దారణ కాలేదు. తిరుమల తిరుపతి దేవస్దానానికి సంబంధించిన అర్చకులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. పూర్తి ఖర్చలను దేవాదాయ శాఖ భరిస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన అర్చకులు, ఈ ఆరు రోజుల కార్యక్రమంలో పాల్గొని ప్రతి రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *