మెదక్ తప్ప… ఇంకేదైనా…
హైదరాబాద్, ఆగస్టు 7
ఆమె ఒక ఫైర్ బ్రాండ్.. రాజకీయాల్లో తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఓసారి ఎంపీగా కూడా గెలించింది. కానీ మళ్ళీ ఆ నియోజకవర్గం నుండి పోటీలో ఉండాలి అంటే నో అంటున్నారట. ఆ నియోజకవర్గం పై ఆమె ఆసక్తి ఎందుకు చూపడం లేదు. ఇంతకి అది ఏ నియోజకవర్గం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాములమ్మ.. ఈ పేరు చెప్పగానే విూకు అర్ధం అయ్యే ఉంటుంది ఆమె ఎవరో.. ప్రస్తుతం విజయ శాంతి రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్. అయితే తాజాగా విజయశాంతి వచ్చే ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుండి పోటీచేస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుంది అని పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారట బీజేపీ నేతలు. ఇక్కడ బీజేపీ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరని.. ఇక్కడ విజయశాంతిని పోటీ దింపుతే బాగుంటుంది అని బీజేపీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.అయితే గత కొద్ది నెలల క్రితం విజయశాంతి మెదక్ నియోజకవర్గ పరిధిలో రెండు సార్లు పర్యటనలు చేయడంతో బీజేపీ తరపున పోటీలో ఉండడం పక్కనే అని అందరూ అనుకున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని పేరున్న విజయశాంతి మాత్రం మెదక్ నియోజకవర్గం నుండి పోటీ అంటే మాత్రం వెనక్కి తగ్గుతుందట. ఎక్కడి నుండి పోటీ చేయమన్న చేస్తా కానీ.. మెదక్ నుండి మాత్రం బరిలో ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చారట విజయశాంతి. ఈ మెదక్ నియోజకవర్గం ఈమెకు కొత్తన అంటే అది కాదు. గతంలో 2009లో మెదక్ పార్లమెంటు స్థానానికి అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు విజయశాంతి. అప్పటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఇదంత కూడా ఆమె మెదక్ ఎంపీగా గెలిచినప్పుడు జరిగిన విషయాలే. కానీ ప్రస్తుతం విజయశాంతి మాత్రం మెదక్ పేరు చెబితేనే బాగా ఇబ్బందికి గురి అవుతున్నారట. అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన అనంతరం, విజయశాంతి కాంగ్రెస్స్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు విజయశాంతి.అయితే ఆ ఎన్నికల్లో విజయశాంతి ఓడిపోవడానికి ప్రధాన కారణం, మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంతమంది నేతల వల్లేనట. విజయశాంతి మెదక్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్స్ పార్టీ తరపున గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతమంది నేతలు కావాలని ఓడగొట్టారని సమాచారం. అప్పటి సొంత పార్టీ నేతలు, ఇతర పార్టీ నేతలతో కలిసి అధికార పార్టీకి కోవర్ట్?లు గా మారి తన ఓటమికి కారణం అయ్యారని.. ఆ ఎపిసోడ్ తర్వాత ఇదే విషయాన్ని తన దగ్గరి వాళ్ళతో పదే పదే చెప్పుకొని బాధపడ్డారట విజయశాంతి. మాజీ ఎమ్మెల్యే పట్టొళ్ల శశిథర్ రెడ్డి లాంటి వ్యక్తి, మరి కొందరు ఇతర పార్టీ నేతలతో కలిసి తన ఓటమికి కారణం అని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. 2018లో కాంగ్రెస్స్ పార్టీ మళ్ళీ టికెట్ ఇస్తాం అని చెప్పిన కూడా వద్దు అని తిరస్కరించారట విజయశాంతి. మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నేతలు ఎలాంటి వారో తనకు అర్ధం అయ్యిందని.. మళ్ళీ మెదక్ లో పోటీ చేసి తనకు ఉన్న ఇమేజ్ ను దెబ్బతీసుకోవడం తనకు ఇష్టం లేదని తనకు కావాల్సిన వారి వద్ద చెబుతోందట విజయ శాంతి. 2014 ఎన్నికల్లో మెదక్ లో గెలిచే అవకాశం ఉన్నప్పుడే అక్కడ ఉన్న అన్ని పార్టీలకు చెందిన లోకల్ లీడర్లు.. మొత్తం కోవర్ట్ లుగా మారి తన ఓటమికి కారణం అయిన విషయాన్ని ఇప్పటికి గుర్తు చేసుకొని బాధపడుతున్న రోజులు చాలానే ఉన్నాయట. అందుకే మెదక్ నుండి మళ్ళీ పోటీ చేసి ఇంకోసారి తప్పు చేయవద్దు అని డిసైడ్ అయ్యారట రాములమ్మ.