రోజుకో మలుపు తిరుగుతున్న వివేకా దర్యాప్తు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు తెలుగు డైలీ సీరియల్ ను తలపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి కి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపిస్తుంటే ఈ నెల 25వరకు అరెస్ట్ చేయకూడదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సురేందర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అవినాశ్ రెడ్డి ప్రతీరోజు సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని జస్టిస్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు. 25న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు సీబీఐ అవినాశ్ రెడ్డికి లిఖిత పూర్వక ప్రశ్నలు అందజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాధానాలు ఆడియో, వీడియో రికార్డులు చేసుకో వచ్చని తెలంగాణ హైకోర్టు సూచించింది. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా దర్యాప్తు ముగించాలని అవినాశ్ రెడ్డి లాయర్ తన వాదనలను వినిపించారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఎలా చేయాలో చెప్పడానికి అవినాశ్ రెడ్డి ఎవరు అని సీబీఐ ప్రశ్నిస్తోంది. ఏ 1 గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్, ఏ 4 దస్తగిరిలను విచారించాల్సి ఉందని అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదిస్తుంది. విట్నెస్లను అవినాశ్ రెడ్డి ప్రభావితం చేస్తాడని సీబీఐ అనుమానిస్తుంది.
హత్య జరిగిన సమయంలో నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారో గూగుల్ టేకౌట్ గుర్తించింది. ఫోరెన్సిక్ సైతం నిర్దారణ చేసిందని సిబీఐ పేర్కొంది.
హత్య కేసులో అసలు ఉద్దేశ్యాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కారణాలు, వ్యాపార లాలాదేవీలు, అక్రమ సంబంధాలు తదితర కోణాల్లో సీబీ ఐ లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె అవినాశ్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కోర్టులో వాదనలు వినిపిస్తుంటే అవినాశ్ రెడ్డి మాత్రం కుటుంబ కలహాలు కారణం అంటూ కోర్టులో వాదనలు వినిపిస్తు న్నారు.