ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. టీ20 సిరీస్ మనదే

India vs Australia 4th T20I Match: ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం (01/12/23) ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మన భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు తిప్పేయడంతో.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 20 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ టీ20 సిరీస్ 3-1తో కైవసం చేసుకుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32)లతో పాటు జితేశ్ శర్మ (35) మెరుగ్గా రాణించడంతో భారత్ అంత స్కోరు చేయగలిగింది. ఇక 175 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. నిజానికి.. మొదట్లో ట్రావిస్ హెడ్ (31) చితక్కొట్టడం చూసి ఆసీస్ జట్టు సునాయాసంగా ఈ మ్యాచ్ గెలుపొందుతుందని అంతా అనుకున్నారు.

కానీ.. ట్రావిస్ హెడ్ ఔటయ్యాక ఆస్ట్రేలియా జోరు తగ్గిపోయింది. మిగతా బ్యాటర్లెవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో కెప్టెన్ మాథ్యూ వేడ్ (36) తనదైన ప్రయత్నం చేశాడు కానీ.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫలితంగా.. 154 పరుగులకే ఆస్ట్రేలియా పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ & రవి బిష్ణోయ్ తలా వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ వేసి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *