ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పిన బుమ్రా.. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది?

టీమిండియా ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. కొన్నేళ్లుగా ముంబై విజయాల్లో అతడు కీలకంగా రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లోకి రావడంతో ఆ జట్టును వీడేందుకు బుమ్రా సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో జస్‌ప్రీత్ బుమ్రా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఒక్క పోస్టుతో తన సమాధానం చెప్పాడు. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమాధానం’ అనే కొటేషన్‌ను బుమ్రా షేర్ చేశాడు. అంటే అతడు ముంబైలో కొనసాగుతాడా లేదా వచ్చే సీజన్‌లో ఇతర ఫ్రాంచైజీలకు ఆడతాడా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడం.. క్యాష్ డీల్‌కు ఆస్కారం ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు భారీ ఆఫర్లతో ఆటగాళ్లకు గాలం వేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు సారథ్యంపై ఆశలు పెట్టుకున్న జస్‌ప్రీత్ బుమ్రా.. హార్దిక్ పాండ్యా రాకతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని రాకతో కెప్టెన్సీ అవకాశాలు మూసుకుపోయాయని భావించిన బుమ్రా.. ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను బుమ్రా అన్‌ఫాలో చేయడం, ఆర్‌సీబీ పేజీని ఫాలో అవుతుండటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ట్రేడింగ్ విండో ద్వారా జస్‌ప్రీత్ బుమ్రా ఆర్‌సీబీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కీలక బౌలర్ హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ వదిలేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *