నాలుగో ఆర్‌ కోసం యత్నాలు

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగడం అందులో టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడడం మామూలే. అంతిమంగా అటు టీఆర్‌ఎస్‌ గానీ, ఇటు బీజేపీ గానీ గెలిచేవి. ముందస్తు ఎన్నికల తర్వాత దుబ్బాక, హుజూర్‌ నగర్‌, హుజూరాబాద్‌, నాగార్జున సాగర్‌ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగాయి.ఇందులో దుబ్బాక, హుజూరాబాద్‌ స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడుపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ?తరుణ్‌ చుగ్‌ తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.త్వరలోనే ఇంచార్జుల నియామకం జరుగుతుందని తెలుస్తోంది. పార్టీ తరపున సర్వేల నిర్వహణ షురూ అయింది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది కమలదళం. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ బాస్‌ బండిసంజయ్‌ ఆ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. కాంగ్రెస్‌పార్టీ నుండి గెలుపొందిన కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్న తరుణంలో ఉప ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు బండి.2018 ఉప ఎన్నికల తరువాత అసెంబ్లీలో ఒకే సీటుకు పరిమితమైన బీజేపి బండి సంజయ్‌ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను మూడుకు పెంచారు. గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, హూజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ లు ‘ట్రిపుల్‌ ఆర్‌‘ గా ప్రాచుర్యం పొందారు. ఈ నేపథ్యంలో మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించడం ద్వారా మరో ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మునుగోడులో గెలిచి బీజేపీ ఖాతాలో నాలుగవ ఆర్‌ ను చేర్చే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పాదయాత్ర లంచ్‌ విరామ సమయంలో బండి సంజయ్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి .కిషన్‌ రెడ్డి, మధ్యప్రదేశ్‌ ఇంఛార్జ్‌ మురళీధర్‌ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు ధీటుగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్రశాఖ కూడా అధికారపార్టీని ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిసింది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలు చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గట్టుప్పల్‌, చండూర్‌, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, రెండు మున్సిపాల్టీలు చౌటుప్పల్‌, చండూర్‌ లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి బిజెపి కి సంబంధించిన రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఉన్నట్టు తెలుస్తోంది.దుబ్బాక, హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి పార్టీ సీనియర్‌ నేతను మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఇంచార్జ్‌ గా నియమించాలని ఇప్పటికే పార్టీలోని సీనియర్‌ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులకు సూచించారు. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి లక్కీ హ్యాండ్‌ అని ఆయనను ఇంచార్జీగా నియమిస్తే ఉప ఎన్నికల్లో గెలుపొందడం తధ్యమనే భావన కమలం శ్రేణుల్లో ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవడం కోసం పార్టీ సీనియర్‌ నాయకులు అందరి సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవర్ని ఇంచార్జీని పెట్టాలనే విషయంపై త్వరలోనే బిజెపి పార్టీకి సంబంధించిన కోర్‌కమిటి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌నాయకులతో సంప్రదించనున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, వివిధ మండలాలకు, మున్సిపాల్టీలకు ఇంచార్జ్‌ను నియమించే యోచనలో బండి సంజయ్‌ ఉన్నారు. 2009, 2014, 2018 లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీనియర్‌ నాయకుడు, బిజెపి రాష్ట్రశాఖ ఉపాధ్యక్షులు డా.జి.మనోహర్‌రెడ్డితో, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బిజెపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే పలుదఫాలు నియోజకవర్గంలోనే నెలకొన్న పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సవిూక్షించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా చూస్తే గౌడ్లు, యాదవులు, రెడ్డి, పద్మశాలి, లంబాడ, మాదిగ సామాజికవర్గాలవారు అధికంగా ఉన్నారు. సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇంచార్జీలను నియమించేటప్పుడు వీరికి అధికప్రాధాన్యత ఇచ్చే యోచనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయపరిస్థితులపై వివిధ సంస్థలచేత పలు సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వే రిపోర్డుల ఆధారంగా ముందుకు వెళ్ళాలని పార్టీ యోచిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రనాయకత్వానికి ఒక నివేదికను పార్టీ రాష్ట్రశాఖ తరుపున పంపినట్టు తెలుస్తోంది. మొత్తం విూద నాలుగో ఆర్‌ బీజేపీ తరఫున అసెంబ్లీకి వెళ్ళడం ఖాయమని ధీమాతో వున్నారు బీజేపీ నేతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *