దళితుల కమ్యూనిటీ స్థలాన్ని రక్షించండి
కొడిచర్లలోని సర్వేనెంబర్ 32లో గల దళితుల కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దళితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వం సర్వేనెంబర్ 32లో కొంతభూమి కొనుగోలు చేసి దళితులకు ఇళ్లస్థలాలను కేటాయించిందన్నారు. అక్కడే కమ్యూనిటీ హాల్ కోసం కొంతస్థలాన్ని కేటాయించిందని తెలిపారు. అయితే రాత్రికి రాత్రే అధికార పార్టీకి చెందిన కొందరు కమ్యూనిటీ స్థలానికి ఫెన్సింగ్ వేసి కబ్జా చేశారని తెలిపారు. ఆక్రమణకు గురైన కమ్యూనిటీ స్థలాన్ని కాపాడి న్యాయంచేయాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ స్పందించి త్వరలో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు.