10 మంది ఎంపీల రాజీనామా

న్యూఢల్లీి, డిసెంబర్‌ 7
భారతీయ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎంపీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది బీజేపీ నేతలు విజయం సాధించారు. వీరిలో పది మంది బీజేపీ ఎంపీలు తమ లోక్‌ సభ సభ్వతానికి బుధవారం రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టేందుకు ఎంపీ పదవికి కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్‌ నాథ్‌, రేణుకా సింగ్‌ ఇంకా రాజీనామా చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం రాజీనామాలు సమర్పించేందుకు బుధవారం స్పీకర్‌ను కలిసింది. అనంతరం 10 మంది ఎంపీలు తమ లోక్‌ సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్‌ సభ స్పీకర్‌ కు విడివిడిగా లేఖలు అందజేశారు. స్పీకర్‌ ను కలిసిన వారిలో రాజస్థాన్‌ నుండి రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, దియా కుమారి, కిరోడి లాల్‌ విూనా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోమతి సాయి, అరుణ్‌ సావో ఉన్నారు. మధ్య ప్రదేశ్‌ నుంచి నరేంద్ర తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, రాకేష్‌ సింగ్‌, ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌, రితీ పాఠక్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఒక్కరూ కూడా విజయం సాధించలేదని తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *