వర్షకాలం.. జీఎస్టీ అర్పణం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. అయితే ఆరంభమైన నాలుగు రోజులలో ఒక్కటంటే ఒక్క గంట సభ సజావుగా సాగిన దాఖలాలు లేవు. అధికార, విపక్షాల మధ్య వాగ్విదవాదాల కారణంగా సభ స్తంభించిపోయింది ఒక్క ముక్కలో తేల్చేయడం సరికాదు. సభ సజావుగా సాగకపోవడానికి కారణం జీఎస్టీ. అవును. జీఎస్టీ అంటూ చేస్తున్న వడ్డింపులకు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ధరలూ పెంచేసినా, పెంచేస్తున్నా సహించి జనం సహనంగా ఉంటున్నారు.అయితే పసి వారికి ఆహారం అయిన పాలపై కూడా సేవా పన్ను విధించడంపై జనాగ్రహమే పార్లమెంటు సభ్యుల నిరసనల వెనుక ఉన్నదనడంలో సందేహం లేదు. పాలపై సేవా పన్ను వ్యతిరేకత కేవలం విపక్షాలకే పరిమితమైన అంశంగా పరిగణించడానికి ఇసుమంతైనా అవకాశం లేదు. ఎందుకంటే పాలపై సేవా పన్నును నిరసిస్తున్నది పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య జనం. వడ్డింపులే పాలనా అన్నట్లుగా మోడీ2.0 హయాం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జీఎస్టీ మండలి సమావేశంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయాన్ని యావద్దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది. పాలు, పెరుగుజ జున్ను వంటి వస్తువులపై పన్ను విధించడంలోని ఔచిత్యాన్ని అన్ని రంగాల వారూ ప్రశ్నిస్తున్నారు. పాల కొరత లేదు. దేశంలో శ్వేత విప్లవం విజయవంతం అయ్యింది. ఎంతటి కరవు పరిస్థితుల్లోనైనా కొరవ లేకుండా పాలు, మజ్జిగ వంటివి పుష్కలంగా లభించే పరిస్థితి ఉంది. పాల కల్తీపై దృష్టి పెట్టాల్సింది పోయి పాలపైనే జీఎస్టీ విధిస్తూ పేదలకు, పసి కందులకు వాటిని దూరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఎలా చూసినా ప్రజా వ్యతిరేకత విధానమే. పాల వ్యాపారంలోని బడా బడా సంస్థలు వచ్చి చేరాయి కనుక పాలపై పన్ను విధించి ఆదాయం దండుకోవాలన్న దుష్ట చింతన వినా పాల ఉత్పత్తులపై సేవా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మరో ఉద్దేశం ఉన్నట్లు కనిపించదు.అసలు జీఎస్టీ విధానం మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది. సామాన్యులు వినియోగించే వస్తువులపై జీఎస్టీ తక్కువ ఉండాలన్న జనం డిమాండ్‌ ను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై జనాభిప్రాయాన్నే కాదు, విపక్షాల ఆందోళనలనూ కేంద్రం పట్టించుకోవడం లేదు. వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌ కోసమే జీఎస్టీ అంటూ చెబుతున్న కేంద్రం.. సంపన్నులు, పేదలను ఒకే గాటన కట్టి పన్నుల విధానాన్ని అవలంబిస్తున్నది. జీఎస్టీ వచ్చిన తరువాత ప్రతి నెలా జీఎస్టీ ఆదాయాన్ని వెల్లడిస్తున్న కేంద్రం.. పన్ను రాబడి పెరిగిందనీ, అదంతా తమ ఘనతేననీ భుజాలు చరిచేసుకుంటోంది. కానీ సామాన్యుల నడ్డి విరిగిన విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది. నెలకు లక్షా నలభైవేల కోట్ల రూపాయిలు పైనే వసూళ్ళు జరుగుతున్నాయని సంబరపడిపోతున్న సర్కార్‌ సంపన్నులు, ఉన్నత ఆదాయ వర్గాలపై పన్ను విధించాలని, సామాన్యులకు మినహాయింపు ఇవ్వాలన్న ప్రాథిమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించేసింది. ఇప్పటికే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాదిలో పదిపదిహేను సార్లు పెంచింది. ప్రస్థతస్థితిలో కట్టేట్టున్నారా లేదా అన్నది ప్రభువుల వారికి బొత్తిగా గిట్టని అంశం. దాన్ని గురించి ఆలోచించమనే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్రధాని, ముఖ్య మంత్రులకు, ఆర్ధిక మంత్రులకు అవేవీ చెవికి ఎక్కడం లేదు. ఇలాంటివారిని చూసి ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి విూద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ? పెట్రోల్‌, డిజిల్‌ టాక్సులు ఎక్స్‌ ట్రా ! బతకడానికి ఊపిరి విూద కూడా రేపో మాపో పన్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచన వారికెందుకు ఇవ్వడం.. చచ్చేదీ సామాన్యలం మనమే! ఎక్కడ ఎక్కువ వస్తువులు కొని ఆనందిస్తారేమోనని ప్రభుత్వానికి ఈర్ష్య. అవును అందుకే జీఎస్టీ లేని వస్తువంటూ లేదు. బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్దమొత్తంలో ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్‌, డీజిల్‌ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రమేమంటే బతకడానికి ఉద్యోగం, పన్నులు కట్టడానికి జీతం అన్నట్టుగా బడుగు జీవుల బతుకులు మార్చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారికోసమే ప్రజలు బతకాలన్నమాట! ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !గతంలో పన్ను లేని ఎల్‌ఈడీలైట్లపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ విధించారు. మరో వైపు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించా లని ఒక వంక ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.అంతెందుకు చదువునే పిల్లలు వాడుకునే పెన్సిల్‌, షార్పనర్‌, ఎరైజర్‌ వంటి వాటిపై కూడా 18 శాతంజీఎస్టీ విధించడమంటే.. జనం చావు జనం ఛస్తారు.. ప్రభుత్వం పని మాత్రం రాబడి పెంచుకోవడమే అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *