టీటీడీ బర్డ్‌ ఆసుపత్రి లైవ్‌ లో సర్జరీలు శ్రీకారం

తిరుపతి, జూన్‌ 30
తిరుపతి బర్డ్‌ ఆసుపత్రి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జులై 2 వరకు లైవ్‌ సర్జరీలు ఏర్పాటుచేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 200 మందికి పైగా ఆర్థో వైద్యులు పాల్గొంటున్నారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రి చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. ఆపరేటివ్‌ ఆర్థో ప్లాస్టీ సమ్మిట్‌ ‘‘ పేరుతో లైవ్‌ సర్జరీలు నిర్వహించే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి తెలిపారు. బర్డ్‌ ఆసుపత్రిలో గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున అత్యాధునిక సేవలు అందిస్తున్నారు. రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించి మెరుగైన కోసం కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునిక స్కానర్లు, ఎక్స్‌ రే మిషన్లు, సిటి స్కానర్లు లాంటి అనేక యంత్రాలను ఏర్పాటు చేశామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. రోగులకు అందుబాటులో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆధునీకరించారు.బర్డ్‌ ఆసుపత్రికి వచ్చే రోగులకే కాకుండా బయటి ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న రోగులకు కూడా తక్కువ ఖర్చుకే సిటి, ఎక్స్‌ రే, రక్త పరీక్షలు చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా వసతులు కల్పించి పేదలకు ఉచితంగా సర్జరీలు చేస్తూ, సొమ్ము చెల్లించి సర్జరీ చేయించుకునే శక్తి ఉన్న వారికి తక్కువ ధరకే మోకీలు మార్పిడి, ఇతర ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని బర్డ్‌ ఆసుపత్రి ప్రత్యేకాధికారి రెడ్డెప్ప తెలిపారు. ఆసుపత్రి నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆన్లైన్‌, ఫోన్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఓపీ సేవలు పొందే సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. బర్డ్‌ వైద్య సేవలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని టీటీడీ నిర్ణయించింది.బర్డ్‌ ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ వైద్యులు వచ్చి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లను ఆసుపత్రి వైద్యులతో పాటు దేశంలోని ఆర్థో వైద్యులు చూసి అవగాహన పెంచుకోవడానికి ఈ సమ్మిట్‌ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌ లో దేశంలోని టాప్‌ 20 ఆర్థో వైద్య నిపుణులు లైవ్‌ లో సర్జరీలు చేస్తారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా నమోదు చేసుకున్న సుమారు 200 మంది వైద్యులు బర్డ్‌ ఆసుపత్రిలోని ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లో జరిగే సర్జరీలను ఫార్చూన్‌ గ్రాండ్‌ రిడ్జ్‌ హోటల్‌ లో వీక్షిస్తారు. సర్జరీకి సంబంధించి తమకు తెలియని విషయాలను సర్జరీ చేస్తున్న ప్రముఖ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. బర్డ్‌ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైద్యుల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించాలని బర్డ్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. డాక్టర్‌ వేణుగోపాల్‌, డాక్టర్‌ దీపక్‌ పర్యవేక్షణలో సమ్మిట్‌ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని డాక్టర్‌ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *