తిలక్ వర్మ అరంగేట్రం చేసేనా?.. నేటి నుంచి భారత్-విండీస్ టీ20 సిరీస్
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను చేజిక్కించుకున్న భారత్.. టీ20 సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు, వన్డే జట్టుతో పోలిస్తే టీ20లకు విండీస్ టీం బలంగా ఉంది. నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, జాన్సన్ ఛార్లెస్, హిట్ మెయర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. దీంతో భారత యువ బౌలర్లు, విండీస్ బ్యాటర్లకు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ ద్వారా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
వెస్టిండీస్ పర్యటనలో పూర్తి జట్టుతో దిగి టెస్టు సిరీస్, ప్రయోగాలు చేస్తూ వన్డే సిరీస్ దక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20 పోరుకు సిద్ధమైంది. టూర్లో భాగంగా నేటి(ఆగస్టు 3) నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచు భారత జట్టు ఆడే 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. టెస్టుల్లో తేలిపోయిన ఆతిథ్య జట్టు, వన్డేలో పోటీ ఇచ్చింది. కానీ టెస్టు, వన్డే జట్లతో పోలిస్తే.. విండీస్ టీ 20 టీమ్లో ప్రమాదకర ప్లేయర్లు ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచును మలుపుతిప్పగల నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, షిమ్రాన్ హిట్ మెయర్ వంటి ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఇటీవల ముగిసిన మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో నికోలస్ పూరన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సెంచరీతో చెలరేగిన పూరన్ ఎంఐ న్యూయార్క్ జట్టుకు తొలి టైటిల్ అందించాడు.
ముఖ్యంగా ఈ సిరీస్ భారత్ బౌలర్లు వర్సెస్ విండీస్ బ్యాటర్లకు మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా సీనియర్లను పక్కన పెట్టడంతో కుర్రాళ్లతో కూడిన భారత జట్టు బరిలోకి దిగనుంది. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముకశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లతో కూడిన పేస్ దళం.. చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్తో కూడిన స్పిన్ యూనిట్ విండీస్ బ్యాటర్లకు సవాల్ విసరనుంది. రోవ్మన్ పావెల్, కైల్ మేయర్స్, పూరన్, హిట్ మెయర్, హోల్డర్ వంటి టీ20 స్పెషలిస్టు ఆటగాళ్లను భారత బౌలింగ్ యూనిట్ ఏమేరకు అడ్డుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ తుది జట్టులో చోటు ఎవరికి..
టీ20 సిరీస్లో భారత తుది జట్ట ఎలా ఉండబోతోంది అనే విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు కుర్రాళ్లనే బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం చాలా రోజుల నుంచి కేవలం యువ ఆటగాళ్లకే పొట్టి ఫార్మాట్లో చోటు కల్పిస్తోంది.
ఐపీఎల్లో రాణించిన తిలక్ వర్మతో పాటు, యశస్వి జైశ్వాల్ కూడా ఈ సిరీస్ ద్వారా టీ20 జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. శుభ్మన్తో కలిసి జైశ్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. తిలక్ వర్మ నాలుగో ప్లేస్లో ఆడనున్నాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లు బ్యాటింగ్లో కీలకం.