ద్రౌపది ముర్ము: గిరిజన, దళిత వ్యక్తి లేదా ఒక మహిళ రాష్ట్రపతి అయితే సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ప్రమాణం చేశారు. ఆమె ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు.
ద్రౌపది ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక వ్యాసం రాశారు. గిరిజనులకు బీజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆ వ్యాసంలో చెప్పారు.
ఇదివరకు రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ దళిత గుర్తింపును కూడా బీజేపీ చాలాసార్లు ప్రస్తావించింది. అంతకుముందు ప్రతిభా దేవి సింగ్ పాటిల్.. ‘‘మహిళా గుర్తింపు’’ను కూడా అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నొక్కిచెప్పింది.
అయితే, ఇలా ఉన్నత పదవుల్లో ఉండే వారి కులాలు, మతాలు, జెండర్ల గుర్తింపుతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమైనా మారతాయా?
అత్యున్నత పదవి…
రాష్ట్రపతిని దేశ తొలి పౌరుడు అని అంటారు. ఈ పదవి చేపట్టిన వ్యక్తికి అపరిమిత అధికారాలు ఉండకపోవచ్చు. కానీ, కొన్ని అధికారిక ప్రకియలకు రాష్ట్రపతి ఆమోదముద్ర తప్పనిసరి.
రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ బిల్లూ చట్ట రూపం దాల్చదు. ఆర్థిక బిల్లు మినహా ఏ బిల్లునైనా పున:పరిశీలనకు ఆయన వెనక్కి పంపించొచ్చు. అయితే, ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
రామ్నాథ్ కోవింద్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క బిల్లును కూడా ప్రభుత్వానికి తిప్పి పంపలేదు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలతోపాటు అన్నింటిపైనా ఆయన మొదటిసారే ఆమోదముద్ర వేశారు.