ఖుషి ఖుషీగా కొండారెడ్డి వాసులు

మహబూబ్‌ నగర్‌, డిసెంబర్‌ 7
కొండారెడ్డి పల్లె ఖుషీ ఖుషీగా సంబురాలు చేసుకుంటోంది. మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందంటూ గ్రామస్తులంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొండారెడ్డి పల్లెకు వెళ్లిన టీవీ9తో.. రేవంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉప్పొంగిపోయారు. తెలంగాణ సీఎంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌ రెడ్డిని అధికారికంగా ప్రకటించటంతో.. కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకున్నారు. రేవంత్‌ అంటూ ప్రేమతో పిలిచుకునే కొండారెడ్డిపల్లి గ్రామస్థులు.. తమ పటేల్‌ సీఎం అయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద కొడుకు ప్రయోజకుడైతే ఎంత సంతోషం ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఆనందం ఉందని మురిసిపోయారు. రేవంత్‌ ఎప్పుడు ఊరికి వచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడని గుర్తు చేసుకున్నారు.అత్త, మామ, బావ, అక్క అంటూ వరుసలు కలుపుతూ కలిసిపోతారని.. రేవంత్‌ ఊరికి వచ్చాడంటేనే పండుగలా ఉంటుందన్నారు. చిన్నా పెద్దా అంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంంచుకున్నారు. ఢల్లీికి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్టు ఆయన ఏ పదవిలో ఉన్న సొంతూరిని.. ఊరి ప్రజలను మాత్రం మర్చిపోరన్నారని అన్నారు గ్రామస్తులు.పాలమూరు జిల్లా నుంచి సీఎం అయిన రెండో లీడర్‌గా రేవంత్‌ రెడ్డి చరిత్ర సృష్టించారు. గతంలో హైదరాబాద్‌ స్టేట్‌కు కల్వకుర్తి నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు. మళ్లీ దశాబ్దాల తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాంతం నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డి తెలంగాణకు సీఎం అయ్యారు. రేవంత్‌ మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు కొండారెడ్డిపల్లె వాసులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *