గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఓ వైపు జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశాలు.. విశాఖపట్నం వేదికగా జరుగుతున్నాయి. ఎన్నికల వేళ.. పార్టీ శ్రేణులకు ఆయన కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 11న చంద్రబాబు.. రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అనంతరం అంటే 12వ తేదీన ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ క్రమంలో 13వ తేదీన గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకురు చేరుకుని.. ఆ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. అ మరునాడు అంటే 14న మచిలీపట్నంలో జోనల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. కొడాలి నాని ఇలాకా అంటే.. గుడివాడలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భారీ బహిరంగ సభపైనే అందరూ దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా కొడాలి నాని.. రాజకీయ అరంగేట్రం చేసి… ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ల లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని ఆరోపణలు శృతిమించాయి. దీంతో అతడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదీకాక.. 2019 ఎన్నికల తర్వాత గుడివాడలో చంద్రబాబు పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడంతో.. ఈ సభపై అందరి ఫోకస్ పడిరది. మరోవైపు గతంలో గుడివాడలో మినీ మహానాడు జరుగుతుందని అంతా భావించినా.. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా ఇదే సభ వేదికపై నుంచి గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ తెలుగుదేశంలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశావహులు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము వర్గీయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరుతో దూసుకుపోతోంది. నారా లోకేశ్.. తన పాదయాత్రలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటిస్తు ముందుకు సాగుతోన్నారు. అలాగే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దింపిన అభ్యర్థి పంచుమర్తి అనురాధ సునాయాసంగా గెలుపొందారు. దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. ఇటు సైకిల్ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని పక్కాగా స్పష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్దిగా కష్టపడితే.. కొడాలి నాని కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమన్న భావన తెలుగుదేశంలో బలంగా వ్యక్తమౌతోంది.