ఇంటింటికి పోస్టల్‌ సేవలు

ప్రస్తుతం పోస్టల్‌ శాఖ తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. గతంలో లెటర్లకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర స్కీమ్‌లు కూడా అందిస్తున్నాయి. బ్యాంకుల వల్ల పలు సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఇండియన్‌ పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మరో 10,000 పోస్టాఫీసులను ఏర్పాటు చేసేందుకు ఇండియా పోస్ట్‌ ఆమోదం తెలిపింది. ఇది కాకుండా, ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి ప్రాజెక్టులు, సాంకేతికతలపై కూడా కృషి చేస్తోంది. సీఐఐ సదస్సులో తపాలా శాఖ కార్యదర్శి అమన్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ శాఖకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు కేటాయించిందని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి పోస్టాఫీసులను ఆధునీకరించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.సాంకేతికత ఉపయోగించి ఇటీవలే గుజరాత్‌లో డ్రోన్ల ద్వారా డెలివరీ పూర్తి చేశామని శర్మ తెలిపారు. 2012లో ప్రారంభించిన ఐటీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. తపాలా, వివిధ ప్రభుత్వ సేవలను త్వరలో ప్రజల ఇంటింటికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పోస్టాఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదన్నారు. అలా కాకుండా సాంకేతికత సహాయంతో, వారి డోర్‌స్టె?ప్‌ సేవలను కూడా అందించనున్నట్లు తెలిపారు.ఇండియా పోస్ట్‌ తన పరిధిని విస్తరించడానికి, మరిన్ని పోస్టాఫీసులను ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దేశ వ్యాప్తంగా 10,000 పోస్టాఫీసులను ప్రారంభించేందుకు ఇండియా పోస్ట్‌ ఆమోదం పొందిందని ఆయన తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10 వేల కొత్త పోస్టాఫీసులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీని తర్వాత మొత్తం పోస్టాఫీసుల సంఖ్య దాదాపు 1.7 లక్షలకు పెరగనుంది. ఇండియా పోస్ట్‌ మెయిల్‌ డెలివరీ, చిన్న పొదుపు పథకాల కింద డిపాజిట్లు, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పిఎల్‌ఐ), రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పిఎల్‌ఐ) కింద జీవిత బీమా రక్షణను అందించడం, బిల్లుల సేకరణ, ఫారమ్‌ల విక్రయం మొదలైన రిటైల్‌ సేవలను అందిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *