నేడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి
ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ, భారతదేశ 7వ ప్రధానమంత్రి (గాంధీ ` నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984 , అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989 , డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. 1944వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ` ఫిరోజ్గాంధీ దంపతులకు పెద్ద కుమారునిగా ఆగస్టు 20,1944న రాజీవ్ గాంధీ జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని డెహ్రాడూన్లో పూర్తి చేసిన రాజీవ్, ఉన్నత విద్యాభ్యాసం ఇంగ్లండ్లో పూర్తి చేశారు. తరువాతి కాలంలో తను అత్యంత అభిమానించే ‘ప్లైయింగ్’ రంగంలో శిక్షణ పొందిన రాజీవ్గాంధీ, ఇండియన్ ఎయిర్ లైన్స్లో పైల్ట్గా తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. ఇంగ్లండ్లో చదువుతున్న సమయంలోనే రాజీవ్ ఇటాలియన్ యువతి అయిన సోనియాను ప్రేమించడం, తరువాతి కాలంలో పెళ్ళి చేసుకోవడం జరిగింది. మొదట్లో ఇందిరాగాంధీ రాజకీయ వారసుడుగా సంజయ్గాంధీనే అని అందరూ భావించారు. అదే విధంగా రాజకీయ వ్యవహారాలలోనూ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలోనూ, పరిపాలనా వ్యవహారాలలోనూ సంజయ్గాందీ జోక్యం అధికంగా వుండేది. రాజీవ్గాంధీ మాత్రం చిన్ననాటి నుండి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచేవారు కాదు. అందుకే రాజీవ్ తనకిష్టమైన రంగంలో ప్రవేశించి పైలెట్గా ఉద్యోగం చేయనారంభించారు. 1980వ సంవత్సరంలో ఒక ప్రమాదంలో సంజయ్గాంధీ మరణించారు. దాంతో ఇందిరాగాంధీ రాజీవ్గాంధీని తన రాజకీయవారసునిగా చేయాలని భావించి రాజీవ్ను పరిపాలనా వ్యవహారాలలో తనకు తోడుగా వుండమని కోరడం జరిగింది. భార్య సోనియాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, తల్లి కోరిక మేరకు రాజీవ్గాంధీ రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1984వ సంవత్సరం అక్టోబర్ నెలలో తన అంగరక్షకుల చేత ఇందిరా గాంధీ హత్య గావించబడడంతో రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడంతో చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా వుండటం, అనుభవం లేకపోవడం వంటి కారణాల వల్ల రాజీవ్గాంధీ ఎక్కువ కాలం పరిపాలన సాగించలేడని అందరూ భావించారు. కానీ, వారందరి నమ్మకాలను వమ్ము చేసే విధంగా రాజీవ్ పూర్తికాలం పదవిలో కొనసాగడమేకాక, పరిపాలనా పరంగా పలుమార్పులు తీసుకురావడమేకాక, ఆధునిక రీతికి తగ్గట్లుగా పాలించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు రాజీవ్. భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అత్యంత పిన్నవయస్కునిగా చరిత్ర సృష్టించారు రాజీవ్గాంధీ. ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంభవిస్తున్న మార్పులకనుగుణంగా భారతదేశాన్ని ముందుకు నడిపించిన సమర్ధనాయకుడు రాజీవ్గాంధీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ఆవశ్యకతను, భవిష్యత్తులో అది పోషించబోయే పాత్రను ముందుగానే ఊహించిన రాజీవ్ గాంధీలోని దార్శనికుడు, ఆ రంగానికి ప్రాధన్యమిచ్చాడు. కానీ, ‘బోఫోర్స్’ కంపెనీ నుండి ఆయుధాలు కొనడంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు రాజీవ్గాంధీ ఎదుర్కోవడం వంటి కారణాల వల్ల 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఎదుర్కోవలసి వచ్చింది. వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా ‘జనతాదళ్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయింది. దాంతో 1991వ సంవత్సరం లో మళ్ళీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో రాజీవ్ గాంధీకి అనుకూల సూచనలు కనపడ్డాయి. 1991వ సంవత్సరం మే21వ తేదీన తమిళనాడులో ‘శ్రీ పెరంబుదూర్’ కు ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన రాజీవ్గాంధీ సభావేదికవైపుగా వెళుతుండగా ఎల్.టి.టి.ఈ ‘ఆత్మాహుతిదళం’ కు చెందిన మహిళ ఆయనకు దండ వేయడానికి వచ్చి బెల్టుబాంబు పేల్చడంతో రాజీవ్గాంధీ అక్కడికక్కడే మరణించారు. రాజీవ్ శరీరం ముక్కలు ముక్కలు కాగా, ఆయన కాలిబూటును బట్టి ఆయన శరీరాన్ని గుర్తించవలసి వచ్చింది. అంతకు ముందు రాజీవ్ ప్రధానిగావున్న సమయంలో శ్రీలంకలో ఎల్.టి.టి.ఈ తో పోరాటానికి భారతసైన్యాన్ని పంపడానికి వ్యతిరేకంగా ఎల్.టి.టి.ఈ టైగర్లు యీ విధంగా రాజీవ్గాంధీని హత్యచేసి పగ తీర్చుకున్నారు. రాజివ్ మరణాంతరం భారతదేశ విశిష్ట పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం 1991లో ప్రకటించింది. ఈయన వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.