బైక్ రైడ్ విశేషాలు.. తోటి రైడర్కి బహుమతి!
తమిళస్టార్ అజిత్కుమార్ (Ajith kumar) ఇటీవల బైక్ టూర్ (Bike Tour) వేసొచ్చారు. ఇప్పటి వరకూ దేశంలోనే వివిధ ప్రాంతాల్లో బైక్ జర్నీ చేసిన ఆయన ఈసారి నేపాల్, భూటాన్ ప్రాంతాలను చుట్టేసివచ్చారు. నవంబర్లో మరో వరల్డ్ టూర్ (world tour in November) వేయడానికి సిద్ధమవుతున్నారు. నేపాల్ ట్రిప్కు ఆయనతోపాటు సహచర రైడర్గా వచ్చిన సుగత్ సత్పతికి ఓ విలువైన గిఫ్ట్ ఇచ్చారు అజిత్. నేపాల్, భూటాన్ ప్రాంతాల్లో విహరించడానికి సుగత్ సహాయపడ్డారు. ఈ జర్నీ మొత్తం తనతో ఉండి గైడ్ చేసిన ఆ యువకుడికి రూ.12.95 లక్షల విలువగల బీఎమ్డబ్ల్యూ సూపర్బైక్ను బహుమతిగా ఇచ్చారు అజిత్. ఈ విషయాన్ని సుగత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘‘తమిళ స్టార్ అజిత్గారితో 2022లో సిక్కింలో పరిచయం ఏర్పడింది. ఆయన కోసం నార్త్ ఈస్ట్ టూర్ ఏర్పాటు చేశా. నేపాల్, భూటాన్ కూడా టూర్ వెళ్తాం అని అప్పుడే నాకు మాటిచ్చారు. ఆ టూర్ మే 6న పూర్తి చేశాం. రోడ్ జర్నీలో ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని కలిశాం. ఎన్నో సూర్యోదయాలు, సూర్యాస్తమాలు చూశాం. ఎన్నో మధుర జ్ఞాపకాలనుపొగేసుకున్నాం. వ్యక్తిగా, స్టార్ హీరోగా అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ టూర్ పూర్తయ్యాక అజిత్ అన్న బీఎమ్డబ్ల్యూ ఎఫ్ 850జీఎస్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మరచిపోలేని అనుభూతి’’ అని సుగత్ పేర్కొన్నారు. (Ajith Kumar Bike Gift to fellow rider)
టూర్ పూర్తిచేసుకుని ఇంటికి చేరిన అజిత్ త్వరలో మళ్లీ షూట్లో పాల్గొనున్నారు. ప్రస్తుతం ఆయన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘విదా ముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ తన తదుపరి టూర్ ఏకే వరల్డ్ రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫేజ్ను ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనున్నారు. తాజాగా ఆయన కొత్త వ్యాపారంలోకి దిగనున్నట్లు ప్రకటించారు అజిత్. ఏకే మోటో రైడ్ అనే అంతర్జాతీయ మోటార్ సైకిల్ టూరింగ్ కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా ఆసక్తిగల రైడర్లు భారతదేశంలోని సుందరమైన ప్రకృతి అందాలను మాత్రమే కాకుండా అంతర్జాతీయ రహదారులను కూడా అన్వేషించే పర్యటనలను ఆస్వాదించవచ్చని ఓ ప్రకటన ద్వారా అజిత్ తెలియజేశారు. బైక్ టూర్లో అనుభవం ఉన్న వారిని ప్రొఫెషనల్ గైడ్గా అపాయింట్ చేశామని, ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, స్థానిక ఆచార వ్యవహారాలు, సంస్కతి సంప్రదాయాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉన్న వారిని గైడ్స్గా సెలక్ట్ చేశామని అజిత్ కుమార్ స్పష్టం చేశారు.