పోటీ ఉన్న స్థానాలపై కాంగ్రెస్ బ్లాంక్
హైదరాబాద్, అక్టోబరు 16
టీకాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తొలి విడత జాబితాను విడుదల చేశారు. అయితే టికెట్ పోటీ ఉన్న స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. కరీంనగర్ జిల్లాలో టికెట్ పోటీ ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.సిరిసిల్లలో కేటీఆర్ కు ప్రత్యర్థిగా అభ్యర్థిని అధిష్టానం ప్రకటించలేదు. 2009 నుంచి కేటీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి కె.కె మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఈసారి సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి మారుతాడా? లేదా మరోసారి మహేందర్ రెడ్డినే ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఇక హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య టికెట్ ఫైట్ నెలకొంది.గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్? ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. హుజురాబాద్ టికెట్ కు సైతం పోటీ నెలకొంది. ఇక్కడ బలమూరి వెంకట్ తో పాటుగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ప్రణవ్ బాబు టికెట్ రేసులో ఉన్నారు. కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠగా మారింది.కాగా, 55 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 12 మంది ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలను అక్టోబర్ 25వ తోదీ లోపు ప్రకటించేందకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి.
మండిపడుతున్న రాగిరెడ్డి
కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై రాగిడి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తన ఉసురు తగులుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగదని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు.ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పని చేశానని పేర్కొన్నారు. ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్న సమయంలో ఇక్కడ పార్టీకి జీవం పోశానని చెప్పారు.అంతేకాకుండా రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోతే ఇక్కడికి ఆహ్వానించి మల్కాజ్ గిరి ఎంపీగా గెలిపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు తమను మర్చిపోయారని వెల్లడిరచారు. రేవంత్ రెడ్డి తనకు వత్తాసు పలికే వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.