సాదా, సీదాగా… చిక్కాల

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ సామాన్యుడిగా వ్యవహరించారు. ఆయనే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు. సోమవారంతో శాసన మండలి సభ్యత్వ కాలం ముగిసింది. ఈ సందర్భంగా ఆయనను దిశ పలకరించింది. అందరితో కలుపుగోలుగా ఉంటానని, పనిచేసినంత కాలం రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించానని చెబుతూ తన మనోగతాన్ని ఆవిష్కరించారు.రామచంద్రపురం వి.ఎస్‌.ఎం కళాశాలలో బీకాం పూర్తి చేశాను. మంచి మార్కులే వచ్చాయి. అటవీ శాఖలో పారెస్టర్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, సెలెక్ట్‌ అయ్యా. అయితే ఉద్యోగం మాత్రం రాలేదు. చివరి నిమిషంలో వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది. అతనికి మంత్రి రికమండేషన్‌ ఉందని చెప్పారు. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. నాడు కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి అప్లై చేయగా రూ.15000 రుణం మంజూరైంది. పది గేదెలను కొని గొల్లపాలెం లో ఉన్న మా మేనత్త కిష్టమ్మ ఇంటి ఆవరణలో ఫారం పెట్టా.పాలు , పాల ఉత్పత్తులను విక్రయిస్తూ క్రమంగా పాల వ్యాపారంలోకి అడుగు పెట్టా. ఈ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుండగానే, కాకినాడ సవిూపంలోని మునసబు తూము వద్ద టిఫిన్‌ హోటల్‌ ప్రారంభించా. అక్కడి వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. అలా జరుగుతుండగా కాకినాడ బస్‌ స్టేషన్‌ వద్ద కేంటిన్‌ పాడుకొనే అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో నెలకు రూ. 3500 అద్దె ఇవ్వడానికి ఒప్పందం అయింది. దీంతో అక్కడ హోటల్‌ పాడుకొన్నాము. మంచి వ్యాపారం జరిగేది. లాభాల బాట పట్టింది. చక్కగా వ్యాపారం చేసుకునే వాడిని..1982లో దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. వెంటనే హైదరాబాదుకు వెళ్లా. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరా. పార్టీ సభ్యత్వాలు చేయించమని రామారావు ఆదేశించారు. అప్పటి తాళ్లరేవు నియోజకవర్గంలో జోరుగా సభ్యత్వాలు చేయించా. ఇది ఎన్టీఆర్‌కు నచ్చింది. కానీ, సీటు ఇవ్వడానికి సంకోచించారు. అన్నీ బాగానే ఉన్నా సొమ్ములు లేవు కదా అన్నారు. రూ. లక్ష దాకా ఖర్చు పెట్టుకోగలనని అన్నా. నాతో పాటు చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎన్టీఆర్‌ నాకు టిక్‌ పెట్టారు.1983లో తొలి పోటీలలో 32,000 మెజార్టీతో వచ్చింది. నాటి నుంచి ఐదు పర్యాయాలు తాళ్లరేవు నియోజకవర్గంలో వరుస విజయాలు అందుకున్న. 1994లో ప్రాథమిక పాఠశాల విద్య మంత్రిగా, 1999లో సహకార శాఖ మంత్రిగా పనిచేశా. 2012లో జరిగిన రామచంద్రపురం ఉప ఎన్నికల్లో పోటీ చేశా. కానీ, తక్కువ ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించగలిగాను. ముందుగా ప్రిపేర్‌ అవ్వడం వల్ల ఇబ్బంది కలగలేదు. 2004 నుంచి 2017 వరకు నేను ఏ పదవీలోనూ లేను. పార్టీ అధికారంలో ఉన్నా, నేను మాత్రం సామాన్యుడిగానే ఉన్నా. ఆ తర్వాత 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఆ పదవి కాలం కూడా ఇప్పుడు ముగిసింది.నా దగ్గర డబ్బు లేదనే బాధ లేదు. ఆస్తులు కూడా పెద్దగా లేవనే ఆవేదన లేదు. రాజకీయ వారసులు లేరనే సంకోచం లేదు. ఏకైక కుమారుడిని సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ విద్యనభ్యసించాడు. రాజకీయాల్లోకి తీసుకురాలేదు. నీతి వంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న. జయ ప్రకాష్‌ నారాయణ ఒకసారి నీతి వంతమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఇచ్చారు. తర్వాత అనేక మార్లు చంద్రబాబు కూడా మెచ్చుకున్నారు. నా జీవితానికి ఇవే పెద్ద ఆస్తులు. చాలా సంతృప్తిగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *