హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటున్న కాంగ్రెస్
అసలైన లౌకికవాదాన్ని అనుసరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆ పేరుతో మైనారిటీలకు పెద్దపీట వేస్తూ, మెజారిటీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్న విమర్శలు కాంగ్రెస్పై చాలాకాలంగా వినిపిస్తోంది. ఆ కారణంగానే ఒకప్పుడు బలమైన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేడు పార్లమెంటులో అత్యంత క్షీణదశకు చేరుకుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే తమకు దూరమైన మెజారిటీ హిందువులను ప్రసన్నం చేసుకోడానికి ఆ పార్టీ ఇప్పుడు హిందుత్వం వైపు మొగ్గుచూపుతోంది. లౌకికవాదం పేరుతో ఇన్నాళ్లుగా రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తన సిద్ధాంతాల నుంచి కాస్త దూరం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ లౌకికవాదం కారణంగా దేశ జనాభాలో 80 శాతం ఉన్న హిందువులు తమకు మెల్లమెల్లగా దూరమవుతూ హిందుత్వవాద రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి దగ్గరయ్యారని కాంగ్రెస్ గ్రహించింది. అసలైన లౌకికవాదాన్ని అనుసరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆ పేరుతో మైనారిటీలకు పెద్దపీట వేస్తూ, మెజారిటీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్న విమర్శలు కాంగ్రెస్పై చాలాకాలంగా వినిపిస్తోంది. ఆ కారణంగానే ఒకప్పుడు బలమైన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేడు పార్లమెంటులో అత్యంత క్షీణదశకు చేరుకుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే తమకు దూరమైన మెజారిటీ హిందువులను ప్రసన్నం చేసుకోడానికి ఆ పార్టీ ఇప్పుడు హిందుత్వం వైపు మొగ్గుచూపుతోంది. అలాగని బీజేపీ తరహా హిందుత్వ రాజకీయాలు కాకుండా.. తాము హిందువులకు వ్యతిరేకం కాదు అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ‘సాఫ్ట్ హిందుత్వ’ (హిందుత్వ అనుకూల) విధానాలను అనుసరిస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హిందూ ఓటర్లను ఆకట్టుకోడానికి హిందుత్వ అనుకూల వ్యూహంతో ముందుకెళ్తోంది. తద్వారా రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని, మధ్యప్రదేశ్లో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది.రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనాభాలో దాదాపు 5.65 శాతంగా ఉన్న రాజ్పుత్ వర్గాన్ని సంతృప్తిపరిచే లక్ష్యంతో ‘వీర్ శిరోమణి మహారాణా ప్రతాప్ బోర్డు’ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 2 శాతంగా ఉన్న యాదవ సమాజాన్ని ప్రసన్నం చేసుకోడానికి ‘శ్రీ కృష్ణ బోర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అలాగే జాట్లు, ధోబీలు, సైనాలతో సహా ఇతర సంఘాల కోసం అనేక బోర్డులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో సేవలందించేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 16 మంది మహిళా పూజారులను సీఎం గెహ్లాట్ నియమించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వెనక్కు తగ్గలేదు. కులాలను ఆకట్టుకునే ప్రయత్నాలు హిందుత్వ ఎజెండాలో భాగం కానప్పటికీ.. ఈ వర్గాల్లో మెజారిటీ ఓటర్లు హిందుత్వ భావజాలంతో బీజేపీకి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఆకట్టుకోడానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కులానికొక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల వ్యూహరచనపై పార్టీ సమావేశాన్ని నిర్వహించడానికి వేదికగా సలాసర్ బాలాజీ ఆలయాన్ని ఎంచుకున్నారు. ఈ సమావేశం జులై 1, 2 తేదీల్లో జరగనుంది. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో సైతం కాంగ్రెస్ దేవాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సొంతగడ్డపై కాషాయదళాన్ని సవాలు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యకు పూనుకుంది.రాజస్థాన్లో కాంగ్రెస్ వైఖరి ఇలా ఉంటే మధ్యప్రదేశ్లో మరో అడుగు ముందుకేసింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. హిందుత్వ గ్రూపు బజరంగ్ సేనను తన శ్రేణిలోకి చేర్చుకుంది. మాజీ సీఎం కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో సాఫ్ట్ హిందుత్వను అనుసరిస్తోంది. తన నియోజకవర్గమైన చింద్వారాలో ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించడం, వివిధ మతపరమైన సమావేశాల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి కమల్ నాథ్ను గద్దెదించిన బిజెపికి ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి గట్టి గుణపాఠం చెప్పాలని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో 91 శాతం ఉన్న హిందువుల మనసు గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న కమల్ నాథ్.. హిందుత్వ విధానం బీజేపీకి మాత్రమే సొంతం కాదు అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్లో తన ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ, రాష్ట్ర ప్రజలకు ఐదు హావిూలను ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె నర్మద నది ఒడ్డున నిలబడి అబద్ధాలు చెప్పనని వ్యాఖ్యానించారు. నర్మద నది కేవలం మధ్యప్రదేశ్ వాసులకే కాదు, ప్రపంచంలోని హిందువులకు పవిత్ర నదుల్లో ఒకటనే విషయం తెలిసిందే.పార్టీ వివిధ హిందూ దేవాలయాల పూజారులను ఆకర్షించడంతో పాటు ఆలయ సందర్శనలలో నిమగ్నమై ఉండటానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్లో పార్టీ ధరమ్ సంవాద్ను నిర్వహించింది. దులో వివిధ హిందూ దేవాలయాల నుండి 500 మంది పూజారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆలయ పూజారులకు గౌరవ వేతనం ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు.ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ తన సాఫ్ట్ హిందుత్వ ఎజెండాను చాలా కాలం నుంచే అమలు చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రజా హిందుత్వ రాజకీయాలలో పాల్గొనడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బఘెల్ ప్రభుత్వం ఇటీవల రాయ్ఘర్లో ‘ది నేషనల్ రామాయణ ఉత్సవం’ నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కంబోడియా, ఇండోనేషియాకు చెందిన రామాయణ మదాలీలు అరణ్య కాండ్పై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా సామూహిక పఠనంతో పాటు రోజువారీ మహా`హారతి వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రాముడితో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటున్న భగేల్ అంతర్జాతీయ రామాయణ ఉత్సవానికి బడ్జెట్లో రూ.12 కోట్లు కేటాయించారు. అదనంగా, కౌశల్య మహోత్సవ్ (రాముడి తల్లి వేడుక), రాంలీలా మరియు మానస్ గానం వంటి హిందూ కార్యక్రమాల కోసం రూ.10 కోట్లు ప్రకటించారు.భాగేల్ నాయకత్వంలో కాంగ్రెస్ మాతా కౌసల్య ఆలయ పునరుద్ధరణను కూడా చేపట్టింది. అంతేకాకుండా, హిందుత్వం అనేది బిజెపికి మాత్రమే పరిమితం కాదనే సందేశాన్ని అందజేయడానికి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారు. బీజేపీ హిందుత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే బాటలో నడవడంపై ఈ మూడు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. అయితే కేవలం హిందత్వ అనుకూల విధానం ఒక్కటే బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీకి సరిపోదన్న అభిప్రాయం వ్యక్తంమవుతోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ కొత్త వ్యూహం కొంత మేర కాంగ్రెస్కు కలిసొచ్చినా.. బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కొన్ని దశాబ్దాలుగా లౌకికవాదం పేరుతో ఆ పార్టీ విస్మరించిన మెజారిటీ హిందూ ఓటర్లలో ఈ సాఫ్ట్ హిందుత్వ ఎంత మేర మార్పు తీసుకొస్తుంది అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషణల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహం ఫలించిందా లేదా అన్నది తెలుస్తుంది.