137 కేంద్రాల్లో ఎంసెట్
తెలంగాణ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఎంసెట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ పరిశీలకుడిని నియమిస్తున్నామని లింబాద్రి వెల్లడిరచారు. మే 10 నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్, ఇతర సెట్ల కన్వీనర్లతో కలిసి మే 2న మండలి కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎంసెట్ పరీక్ష పర్యవేక్షణకు గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ పరిశీలకుడు ఉండేవారని.. ఈ సారి సిట్టింగ్ స్క్వాడ్ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్కూ ఓ పరిశీలకుడు ఉంటారని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయని.. ఇంజినీరింగ్కు 29 పరీక్షా కేంద్రాలు పెంచామన్నారు. ఇప్పటికే 2లక్షలకు పైగా విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది ఎంసెట్కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని లింబాద్రి తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. లాసెట్ను ఒకే రోజు మూడు సెషన్లలో, ఈసెట్ పరీక్ష ఒకే పూటలో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్లో ఉందని తెలిపారు.జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయన్నారు. కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని వీసీ తెలిపారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఆన్లైన్ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయని సాంకేతిక ఆడిట్ కూడా చేయించామని చెప్పారు. పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ విధానాన్ని కొత్తగా అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది ఎడ్సెట్ను ఒకే రోజు మూడు విడతలుగా జరిపామని.. ఈ సారి లాసెట్నూ అలాగే నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ప్రవేశాలు పొందిన రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి లేదు కదా.. అన్న ప్రశ్నకు లింబాద్రి బదులిస్తూ.. బిల్లు ప్రాసెస్లో ఉందని చెప్పారుఈ సందర్భంగా ఎంసెట్ ఛైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రాంగణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో బీటెక్ బయో టెక్నాలజీ బ్రాంచీని ప్రవేశ పెడుతున్నామన్నారు. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు మరో నాలుగైదు రోజుల్లో కళాశాలల తనిఖీలు పూర్తవుతాయన్నారు. సమావేశంలో ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్రెడ్డి, పీజీఈసెట్, ఈసెట్, లాసెట్ కన్వీనర్లు శ్రీరాం వెంకటేశ్, రవీందర్రెడ్డి, విజయలక్ష్మి, ఎడ్సెట్ కో కన్వీనర్ శంకర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.