గ్యాంగ్‌స్టర్లకు బ్రూమ్‌స్టిక్‌తో చుక్కలు చూపించిన సాహస వనిత..

భివాని: రీల్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రియల్ లైఫ్ ఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిస్తోళ్లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు సైతం బూజుల కర్ర (Broom stick) ముందు బలాదూర్ అయ్యారు. బ్రూమ్ స్టిక్ దెబ్బకి గ్యాంగ్‌స్టర్లు కాళ్లకు బుద్ధి చెప్పారు. ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. బ్రూమ్ స్టిక్ పట్టిన హర్యానా వీర మహిళ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో హైలైట్ అయింది. ఆసక్తి రేకెత్తించిన ఈ ఘటన హర్యానాలోని భివానీలో జరిగింది.

భివానీలోని దర్బార్ కాలనీ సోమవారం ఉదయం ఒక్కసారిగా తుపాకీ పేలుళ్లతో దద్దరిల్లింది. రవి బాక్సర్ హత్య కేసులో ఇటీవలే బెయిలుపై వచ్చిన హరికిషన్ అలియాస్ హరి హరియ అనే వ్యక్తి రోడ్డుపై నిలుచుని ఉన్నారు. ఆ సమయంలో రెండు బైకులపై నలుగురు సభ్యుల ముఠా (Gangsters) అక్కడికి చేరుకుంది. వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు సభ్యులు క్షణాల్లో కిందకు దిగి హరికిషన్‌పై కాల్పులు జరిపారు. దీన్ని వెంటనే గ్రహించిన హరికిషన్ కాలిసత్తువ కొద్దీ అక్కడున్న ఒక ఇంట్లోకి పారిపోగా, ముఠా సభ్యులు ఇద్దరూ తుపాకులతో కాల్పులు కొనసాగించారు. ఇంతలో పిడుగు పడినట్టుగా పక్కింటి నుంచి ఒక మహిళ బ్రూమ్ స్టిక్‌తో దుండగులపై విరుచుకుపడింది. ఈ ఘటనతో అవాక్కయిన ఆ ఇద్దరూ పరుగు లంఘించుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై అంతా కలిసి ఉడాయించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయి సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఆ సాహస మహిళపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళా శక్తి ముందు ఈ శక్తి పనిచేయదని, ప్రాణాలకు తెగించి ఆమె ముందుకు రాకపోయి ఉంటే హరికిషన్ తుపాకీ గుళ్లకు బలయ్యే వాడని అభినందనలు వెల్లువత్తుతున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరికిషన్‌ను ఆసుపత్రిలో చేర్చిన భివాండీ పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *