మునుగోడులో గులాబీ అసమ్మతి రాగం….
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతి రాగం మొదలైంది. గత ఎన్నికల్లోనూ అసమ్మతి రాగంతో ఓటమిపాలైంది. త్వరలోనే జరుగనున్న బైపోల్లో సైతం అసమ్మతి రాగం పార్టీని వెంటాడుతోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులంతా భేటీ కావడం చర్చనీయాంశమైంది. కూసుకుంట్ల వ్యతిరేకంగా పనిచేయాలని సైతం నిర్ణయించినట్లు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం అసమ్మతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.టీఆర్ఎస్ క్రమశిక్షణ గల పార్టీగా ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీ కేడర్ పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా పార్టీ గాడి తప్పుతోంది. దీనికి కారణం స్థానిక నేతల్లో గ్రూపు రాజకీయాలే. అధిష్టానం సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నేతల మధ్య విభేదాలకు తారాస్థాయికి చేరుతున్నాయి. అంతేగాకుండా అన్ని ప్రధాన పార్టీల నుంచి కీలకనేతలు కూడా గులాబీ గూటికి చేరడంతో విభేదాలకు మరోకారణం. అదే పార్టీ ఓటమికి కారణమవుతున్నాయి. త్వరలో మునుగోడు ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో అసమ్మతిరాగం ఊపందుకుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు మండల స్థాయి నేతలు ప్రత్యేకంగా సోమవారం భేటీ అయినట్లు సమాచారం. కూసుకుంట్ల నేతలందరినీ కలుపుకొని పోరని, వర్గాల ప్రోత్సహించడంతోనే వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానంతోపాటు జిల్లా మంత్రి, నియోజకవర్గ ఇన్ చార్జీకి సైతం తెలియజేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు విశ్వసనీయ సమాచారం. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని, ఇస్తే ఓటమి పాలుకావడం తధ్యమని నేతలు చర్చించినట్లు సమాచారం.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో టీఆర్ఎస్కు ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని, 2018 సెప్టెంబర్లో హైదరాబాద్లో రాష్ట్ర నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్ రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, మండల, జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు. అయినప్పటికీ టికెట్ను అధిష్టానం కూసుకుంట్లకు ఇవ్వడంతో నేతలు సహకరించలేదు. సమావేశం నిర్వహించిన వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ నేతల అసంతృప్తితో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ నేతలే సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బైపోల్ నేపథ్యంలో మళ్లీ కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక ప్రజాప్రతినిధులు భేటీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడు పునరావృతం అవుతుందా? అనేది కేడర్లో సందిగ్ధత నెలకొంది.ఉప ఎన్నికను టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది పలుకుతుందని, ఈ విజయం పార్టీ నేతలతోపాటు ప్రజల్లోనూ ఓ నమ్మకం కలిగించనుంది. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది ఏ పార్టీ అనేది కూడా డిసైడ్ చేయనుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం రాబోయే ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుందని భావించి అన్ని పార్టీలు విజయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించడం దానికి టికెట్ కోసం యత్నిస్తున్న కీలక నేతలు ఎవరు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అసలు ఎవరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారనేదానిపై పార్టీ ఆరాతీస్తున్నట్లు సమాచారం. వారిలో అసమ్మతికి గల కారణం తదితర వివరాలను సైతం సేకరిస్తున్నారు. అయితే సమావేశం అయిన నేతలతో పార్టీ అధిష్టానం మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందా? లేకుంటే వారిపై వేటు వేస్తుందా ? అనేది వేచిచూడాల్సిందే. అసమ్మతికి చెక్ పెట్టకపోతే మరోసారి టీఆర్ఎస్ ఓటమి చవిచూడాల్సి వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత ఉంది. రెండోస్థానంలోకాంగ్రెస్, మూడోస్థానంలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. అయితే వ్యక్తి గతంగా మాత్రం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ప్రజల మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు తక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే హుజూరాబాద్లో కూడా ఇలాగే సర్వే రిపోర్టులు రావడం, అక్కడ ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మునుగోడులో సైతం అదే పునరావృతం అవుతుందా? అనేది చూడాల్సిందే. అయితే మునుగోడులో టీఆర్ఎస్లో అసమ్మతిని చల్లారిస్తే మాత్రం రెండోసారి మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ టీఆర్ఎస్ అధిష్టానం చేపట్టే చర్యలపైనే విజయం ఆధారపడి ఉంది.