పంద్రాగస్టు… పంతాలు

దేశ భక్తి అయినా, దైవ భక్తి అయినా, మరో భక్తి భావన ఏదైనా స్వతహాగా లోపలి నుంచి రావాలి, కానీ, పెదవుల పై పూసుకుని పలికే లిప్‌ స్టిక్‌ పలుకులు పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభావం చూపావు. ఒరిజినల్‌, డూప్లికేట్ల మధ్య పొంతన పోలిక కుదరదు. అసలు అసలే,, నకిలీ నకిలీనే.. అసలు నకిలీ కాదు, నకిలీ అసలు కాలేదు. అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, విూరు ‘జై శ్రీరామ్‌’ అంటే మేము ‘జై హనుమాన్‌’ అంటాం అంటూ బీజేపేతో భక్తి పోటీకి దిగారు. అన్నట్టుగానే కొంతా కాలం పాటు, అక్కడక్కడ హనుమాన చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకనో, ఆమె సైలెంటై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు, నేను చేసినన్ని పూజలు, యాగాలు ఎవరు చేశారు? అంటూ అప్పుడప్పుడు, ‘నేనూ హిందువునే … అని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే,,ఆయన కడుపులోంచి వచ్చిన హిందుగాడు బొందు గాడు డైలాగు పాపులర్‌ అయినంతగా, ఆయన చెప్పిన నేనూ హిందువునే …డైలాగు పాపులర్‌ కాలేదు.ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోడీతో దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా పేరిట దేశ వ్యాప్తంగా జెండా పండగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మామూలుగా అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ళలో ఆయన ఏనాడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొన లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొన లేదు. ఈ సంవత్సరం రాజభవన్‌ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోను ముఖ్యమంత్రి పాల్గొన లేదు, విూ జెండా విూది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్‌ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో ముఖ్యమంత్రి కేసీఆర్‌, సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో మరిచి పోయారు. , దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్‌ చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారని అంటున్నారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్‌ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని, ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, మేమూ హిందువులమే .. అన్నట్లుగా, మాకూ దేశ భక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్య్ర దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వ్యూహ రచన చేశారని అంటున్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా, జెండా కర్రతో సహ త్రివర్ణ పతాకాన్ని, ఇంటింటికి అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే, ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకుంది. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో దేశ భక్తీ పోటీలో తమదే పై చేయి అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ప్రభుత్వం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అయితే…. అధికారులు కొందరు ఇదంతా చూస్తుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు .. అన్న సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *